అమెరికాకు భారీ సంఖ్యలో తెలుగు విద్యార్థులు
ABN , First Publish Date - 2021-09-02T12:39:14+05:30 IST
తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు అమెరికాలో ఉన్నత చదువులు చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికాలో చదువుకోవాలనుకునే యువతకు మార్గదర్శనం చేయడానికి అమెరికాకు చెందిన విద్యా సాంస్కృతిక వ్యవహారాల విభాగం ఆగస్టు 27న గ్రాడ్యుయేట్ వర్చువల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించింది.
అమెరికాకు తెలుగు విద్యార్థుల క్యూ
ఎడ్యుకేషన్ ఫెయిర్లో
32శాతం మంది మనవాళ్లే
నగరాల వారీగా చూస్తే హైదరాబాద్ టాప్
సెప్టెంబర్ 3న మళ్లీ ఎడ్యుకేషన్ ఫెయిర్
అమెరికా కాన్సులేట్ అధికారుల వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబరు 1: తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు అమెరికాలో ఉన్నత చదువులు చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికాలో చదువుకోవాలనుకునే యువతకు మార్గదర్శనం చేయడానికి అమెరికాకు చెందిన విద్యా సాంస్కృతిక వ్యవహారాల విభాగం ఆగస్టు 27న గ్రాడ్యుయేట్ వర్చువల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించింది. ఈ ఫెయిర్లో మన దేశం నుంచి మొత్తం 6వేల మంది పాల్గొంటే వారిలో 1,962 మంది... అంటే 32 శాతం విద్యార్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందినవారే. గతేడాదితో పోలిస్తే ఇది 44 శాతం అధికం. అమెరికాలో ఉన్నత చదువులపై ఆసక్తి చూపించిన వారిలో ఎక్కువమంది హైదరాబాద్ నుంచే ఉన్నారని నగరంలోని అమెరికా కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్మన్ తెలిపారు. ఈ ఫెయిర్లో అమెరికాకు చెందిన 101 విద్యాసంస్థలు పాల్గొన్నాయి. వీటిలో కొలరాడో స్టేట్ యూనివర్సిటీ, ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, పిట్స్బర్గ్ యూనివర్సిటీ లాంటి పలు ప్రముఖ సంస్థలూ ఉన్నాయి. విద్యారులు ఈ విద్యాసంస్థలకు చెందిన ప్రతినిధులతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. స్టూడెంట్ వీసా ప్రక్రియ గురించి అమెరికా దౌత్య కార్యాలయం అధికారులు విద్యార్థులకు వివరించారు. సెప్టెంబర్ 3న మరో ఎడ్యుకేషన్ ఫెయిర్ను నిర్వహించనున్నట్టు రీఫ్మన్ వెల్లడించారు.
జోయల్ రీఫ్మన్, హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ చైనా తర్వాత భారతదేశానికి చెందిన యువత అధిక సంఖ్యలో అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్నారు. అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో 18శాతం మంది భారతదేశానికి చెందినవారే ఉన్నారు. కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ గతేడాది భారత్ నుంచి 2 లక్షల మంది విద్యార్థులు అమెరికాలోని పలు విద్యాసంస్థల్లో చేరారు. అమెరికాలో చదవాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం అమెరికా ప్రభుత్వం 170కి పైగా దేశాల్లో 430 సహాయ కేంద్రాలను నిర్వహిస్తోంది.