ప్రపంచ వ్యాప్తంగా దీక్ష దివస్ నిర్వహించాలి: మహేష్ బిగాల
ABN , First Publish Date - 2021-11-28T21:14:42+05:30 IST
అమెరికాలోని అట్లాంటాలో, న్యూజెర్సీలో ప్రత్యక్షంగా దీక్ష దివస్లో పాల్గొననున్నట్టు మహేష్ బిగాల తెలిపారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన దీక్షకు 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్, 2009న కేసీఆర్ గారు అమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమ గతిని దీక్షా దివస్ మార్చేసింది. తెలంగాణ సమాజం యావత్తు కేసిఆర్ వెంట నిలవడంతో.. కేంద్రం మెడలు వంచి చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఈ సందర్భంగా అమెరికాలోని అట్లాంటాలో, న్యూజెర్సీలో ప్రత్యక్షంగా దీక్ష దివస్లో తాను పాల్గొననున్నట్టు మహేష్ బిగాల తెలిపారు. ఈ క్రమంలో దీక్షా దీవస్ స్ఫూర్తిని, అమరుల త్యాగాలను, జ్ఞాపకాలను, పోరాటాలను గుర్తించి ప్రపంచ దేశాలలో దీక్ష దివస్ని జరపాలని ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపునిచ్చారు.
అదే విధంగా.. దీక్ష దివస్ సందర్బంగా తెలంగాణ అమరులకు, తెలంగాణ ఉద్యమ నేతలు స్వర్గీయులు ప్రొఫెసర్ జయ శంకర్ సర్, విద్య సాగర్, నాయిని నర్సింహా రెడ్డి, రామలింగ రెడ్డి, నోముల నర్సింహయ్య తదితరులకు నివాళులు అర్పించాలని కోరారు.అద్భుతమైన ప్రజా సంక్షేమ పథకాలతో ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధన దిశగా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు, ఈ క్రమంలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి ఉంటాయని పేర్కొన్నారు.