కెనడాలో కరోనా కేసులు పెంచుతున్న న్యూఢిల్లీ-టొరంటో విమాన సర్వీసులు

ABN , First Publish Date - 2021-03-21T15:35:29+05:30 IST

న్యూఢిల్లీ టు టొరంటో విమాన సర్వీసుల్లో ప్రయాణించే అంతర్జాతీయ ప్రయాణికులు భారీగా కరోనా బారినపడుతున్నట్లు తాజాగా కెనడా ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదిక పేర్కొంది.

కెనడాలో కరోనా కేసులు పెంచుతున్న న్యూఢిల్లీ-టొరంటో విమాన సర్వీసులు

టొరంటో: న్యూఢిల్లీ టు టొరంటో విమాన సర్వీసుల్లో ప్రయాణించే అంతర్జాతీయ ప్రయాణికులు భారీగా కరోనా బారినపడుతున్నట్లు తాజాగా కెనడా ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ప్రతిరోజు ఎయిర్ ఇండియా, ఎయిర్ కెనడా రెండు విమాన సర్వీసులు నడిపిస్తున్నాయి. మార్చి 3 నుంచి 19వ తేదీ వరకు దేశంలో నమోదైన కేసుల్లో దాదాపుగా అన్ని కూడా న్యూఢిల్లీ-టొరంటో సర్వీసుల్లో ప్రయాణించిన వారి ద్వారానే వ్యాప్తి చెందినట్లు ఈ డేటా చెబుతోంది. మార్చి 4న ఢిల్లీ నుంచి కెనడా వెళ్లిన విమాన సర్వీసులో ఏకంగా 30 మందికి వైరస్ సోకినట్లు తేలింది. వీటిలో 9 కేసులు వాంకోవర్‌లో నమోదైతే, మరో 21 టొరంటోలో నమోదయ్యాయి. ఇక మార్చి 9, 13 తేదీల్లో ఢిల్లీ నుంచి టొరంటోలో వచ్చిన విమాన సర్వీసులు అత్యధిక పాజిటివ్ కేసులను మోసుకువచ్చాయని కెనడా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.


మార్చి 9న ఢిల్లీ నుండి వెళ్లిన ఎయిర్ కెనడా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలో మొత్తం బిజినెస్ క్లాస్, ప్రీమియం ఎకానమి క్యాబిన్‌లు వైరస్‌తో ప్రభావితమయ్యాయని తెలిసింది. అలాగే మార్చి 13న టొరంటోలో దిగిన ఎయిర్ ఇండియా విమానంలోని 35 ఎకనామి క్లాస్ వరుసల్లో 22 వరుసలకు వైరస్ సోకినట్లు తేలింది. ఇలా అంతర్జాతీయ ప్రయాణికుల్లో వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కెనడా సర్కార్ అప్రమత్తమైంది. తమ దేశానికి వచ్చే వారు విమానం ఎక్కడానికి ముందే కొవిడ్-19 నెగెటివ్ చూపించాలని నిబంధన పెట్టింది. అలాగే కెనడా చేరుకున్న తర్వాత మరోసారి కరోనా టెస్టు చేయించుకోవడంతో పాటు మూడు రోజులు ప్రభుత్వం ఎంపిక చేసిన హోటళ్లలో క్వారంటైన్‌లో ఉండాలని సంబంధిత అధికారులు వెల్లడించారు.    

Updated Date - 2021-03-21T15:35:29+05:30 IST