బోనీ కపూర్ ఫ్యామిలీకి UAE బంపర్ ఆఫర్.. ఆనందంలో కపూర్ కుటుంబం
ABN , First Publish Date - 2021-11-13T17:13:48+05:30 IST
బోనీ కపూర్ ఫ్యామిలీకి ఇటీవల యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా ప్రకటించిన విషయం తెలిసిందే.
దుబాయ్: బోనీ కపూర్ ఫ్యామిలీకి ఇటీవల యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా ప్రకటించిన విషయం తెలిసిందే. బోనీ కపూర్తో సహా ఆయన నలుగురు పిల్లలు ఖుషీ కపూర్, జాన్వీ కపూర్, అర్జున్ కపూర్, అన్షులా కపూర్లకు గోల్డెన్ వీసా మంజూరు చేసింది. కళాకారులను పెట్టుబడిదారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దుబాయ్ ప్రభుత్వం 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు అందిస్తోంది. ఈ క్రమంలోనే బోనీకపూర్ కుటుంబానికి గోల్డెన్ వీసాలు జారీ చేసింది. తాజాగా బోనీ కపూర్ తన ఇద్దరు కూతుళ్లు ఖుషీ కపూర్, జాన్వీ కపూర్లతో కలిసి గోల్డెన్ వీసా అందుకున్నారు. గురువారం దుబాయ్లో జరిగిన ఓ కార్యక్రమంలో అక్కడి అధికారులు ఈ ముగ్గురికి వీసాలు అందజేశారు.
అయితే, బోనీ కపూర్ మరో ఇద్దరు పిల్లలు అర్జున్ కపూర్, అన్షులా కపూర్ మాత్రం ఈ కార్యక్రమానికి వెళ్లలేదు. అర్జున్ కపూర్ తన బిజీ షెడ్యూల్ కారణంగా దుబాయ్ వెళ్లలేకపోయారని తెలిసింది. అలాగే అన్షులా కూడా ఇతర కారణాలతో ఈ కార్యక్రమానికి వెళ్లలేకపోయింది. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా బోనీ కపూర్ కూతుళ్లు జాన్వీ, ఖుషీ కపూర్తో కలిసి వీసాలను అందుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను బోనీ కపూర్ ట్విటర్లో పోస్ట్ చేశారు.
ఇదిలాఉంటే.. భారత్ నుంచి ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్న సంగతి తెలిసిందే. వీరిలో బాలీవుడ్కు చెందిన షారూక్ ఖాన్, సంజయ్దత్, సునీల్ షెట్టి, బోనీ కపూర్ ఫ్యామిలీ, సంజయ్ కపూర్, ఊర్వశి రౌతేలా, ఫరా ఖాన్ కుందన్ ఉన్నారు. అలాగే మలయాళం నుంచి మోహన్లాల్, మమ్ముటీ, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ ఉన్నారు. వీరితో పాటు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ప్రముఖ గాయని కేఎస్ చిత్ర, తమిళ నటి త్రిష కృష్ణన్ కూడా ఇటీవల గోల్డెన్ వీసా అందుకున్నారు. సినిమా రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో అంతర్జాతీయ ప్రతిభావంతులను ప్రోత్సహించాలని నిర్ణయించిన యూఏఈ సర్కార్.. ఈ రంగానికి చెందిన ప్రముఖులకు ఇలా గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తోంది.