Green Card: యూఎస్ కాంగ్రెస్లో కీలక బిల్లు.. భారత ఐటీ నిపుణులకు మేలు!
ABN , First Publish Date - 2021-06-03T19:38:21+05:30 IST
అమెరికా కాంగ్రెస్లో మరో కీలక బిల్లు ప్రవేశపెట్టబడింది. ప్రస్తుతం గ్రీన్కార్డుల జారీలో దేశాల వారీగా ఉన్న కోటాను(కంట్రీ క్యాప్-7శాతం) తొలగించాలంటూ ఇద్దరు కాంగ్రెస్సభ్యులు ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్లో మరో కీలక బిల్లు ప్రవేశపెట్టబడింది. ప్రస్తుతం గ్రీన్కార్డుల జారీలో దేశాల వారీగా ఉన్న కోటాను(కంట్రీ క్యాప్-7శాతం) తొలగించాలంటూ ఇద్దరు కాంగ్రెస్సభ్యులు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పాసైతే మాత్రం దశాబ్దాల తరబడి గ్రీన్కార్డుల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది భారతీయ ఐటీ నిపుణులకు మేలు జరుగుతుంది. కాగా, గ్రీన్కార్డుల జారీలో సమానత్వం తీసుకురావాలనే ఏకైక ఉద్దేశంతో '2021 ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయిమెంట్(ఈఏజీఎల్ఈ)'-'ఈగల్ యాక్ట్' పేరిట ఈ బిల్లును కాంగ్రెస్ సభ్యులు జో లఫ్గ్రెన్, జాన్ కర్టిస్ తాజాగా అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. అలాగే కుటుంబ ఆధారిత వీసాలపై ఉన్న పరిమితిని కూడా 15 శాతానికి పెంచాలని బిల్లులో పేర్కొన్నారు. ఎన్నో దశాబ్దాలుగా దెబ్బతిన్న యూఎస్ వలసల వ్యవస్థను ప్రక్షాళనం చేసేందుకు ఇదే సరియైన సమయమని ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు అభిప్రాయపడ్డారు.
ఇక ప్రస్తుతం గ్రీన్కార్డుల జారీలో అనుసరిస్తున్న దేశాల వారీ పరిమితి(కంట్రీ క్యాప్-7శాతం) అనేది 1990లో తీసుకొచ్చిందని, దీనిద్వారా అధిక జనాభా ఉన్న దేశాలకు, తక్కువ జనాభా ఉన్న దేశాలకు ఒకే విధంగా గ్రీన్కార్డులు ఇస్తే సమానత్వం లోపిస్తుందని కాంగ్రెస్ సభ్యులు అన్నారు. దాంతో అధిక జనాభాలోని మంచి నైపుణ్యం ఉన్నవారికి అవకాశం దక్కడం లేదని కాంగ్రెస్ సభ్యులు జో లఫ్గ్రెన్ తెలిపారు. ఫలితంగా మెరుగైన నైపుణ్యం గల వారు ఇతర దేశాలకు తరలిపోతున్నారని అన్నారు. ఇది అమెరికా ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ సభ్యులు పేర్కొన్నారు. కనుక ఈ దేశాల వారీ పరిమితిని పూర్తిగా ఎత్తివేయాలంటూ తాజాగా 'ఈగల్ యాక్ట్' బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు గట్టెక్కితే గ్రీన్కార్డు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఎంతోమంది భారతీయ ఐటీ నిపుణుల నిరీక్షణకు తెరపడినట్టే.