Australiaలో తెలుగోడికి అరుదైన గౌరవం.. తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డ్!

ABN , First Publish Date - 2021-11-26T18:19:54+05:30 IST

ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. భారత సంతతికి చెందిన చెన్నుపాటి జగదీష్​ అనే ప్రొఫెసర్‌ను ఆస్ట్రేలియన్​ అకాడమీ ఆఫ్​ సైన్స్​ తదుపరి అధ్యక్షుడిగా నియమించింది.

Australiaలో తెలుగోడికి అరుదైన గౌరవం.. తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డ్!

సిడ్నీ: ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. భారత సంతతికి చెందిన చెన్నుపాటి జగదీష్​ అనే ప్రొఫెసర్‌ను ఆస్ట్రేలియన్​ అకాడమీ ఆఫ్​ సైన్స్​ తదుపరి అధ్యక్షుడిగా నియమించింది. దీంతో ఈ పదవి చేపట్టబోతున్న తొలి భారత సంతతి వ్యక్తిగా జగదీష్ చరిత్ర సృష్టించారు. 2022 మే నుంచి ఆయన ఆస్ట్రేలియన్​ అకాడమీ ఆఫ్​ సైన్స్​ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. నానోటెక్నాలజీలో నిష్ణాతుడైన జగదీష్ ప్రస్తుతం ఆస్ట్రేలియన్​ నేషనల్​ యూనివర్సిటీ(ఏఎన్‌యూ)లో భౌతిక శాస్త్రం పరిశోధకుడిగా కొనగుతున్నారు. తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల జగదీష్ హర్షం వ్యక్తం చేశారు. 1990లో రెండు సంవత్సరాల కాంట్రాక్ట్​తో ఆస్ట్రేలియన్ అకాడమీకి వచ్చానని చెప్పిన ఆయన, ఇప్పుడు దానికే బాస్ అవుతానని కలలో కూడా అనుకోలేదని చెప్పుకొచ్చారు.


ఇక జగదీష్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని వల్లూరు పాలెం. నాగార్జున యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్​ పట్టా పొందిన ఆయన.. 1977లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. అనంతరం 1988లో ఢిల్లీ యూనివర్సిటీలో పీహెచ్​డీ పూర్తిచేసి, కొన్నాళ్లు కెనడాలో ప్రొఫెసర్‌గా పని చేశారు. ఆ తర్వాత 1990లో ఆస్ట్రేలియాకు వెళ్లారు. అక్కడ ఆప్ట్రో ఎలక్ట్రానిక్స్​, నానోటెక్నాలజీ రంగాల్లో ఓ పరిశోధన సంస్థను స్థాపించారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2016లో ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం సందర్భంగా ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారానికి జగదీష్‌ ఎంపికయ్యారు.

Updated Date - 2021-11-26T18:19:54+05:30 IST