సంచలన నిర్ణయం తీసుకున్న టెక్సాస్ గవర్నర్.. ఇకపై..
ABN , First Publish Date - 2021-03-03T19:05:03+05:30 IST
టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాస్క్ తప్పనిసరి నిబంధనలను రాష్ట్ర వ్యాప్తంగా
ఆస్టిన్: టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాస్క్ తప్పనిసరి నిబంధనలను రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తివేస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. అంతేకాకుండా కరోనా కారణంగా మూతపడ్డ వ్యాపార సంస్థలను తెరిచేందుకు అనుమతులు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. కరోనా కారణంగా రాష్ట్రంలో వ్యాపారాలు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదని, ఇప్పుడు పూర్తిగా తెరిచేందుకు అనుమతులిస్తున్నామన్నారు. లుబ్బాక్ చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతుండటం, అలాగే వ్యాక్సిన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుండటం వల్ల మాస్క్ తప్పనిసరి అనే నిబంధనలను ఎత్తివేస్తున్నామన్నారు.
బుధవారం నుంచి కొత్త ఆదేశాలు అమల్లోకి రానున్నట్టు ఆయన చెప్పారు. కరోనా ఆంక్షల వల్ల అనేక మంది ఉపాధిని కోల్పోయారని, చిన్న చిన్న వ్యాపారులు కూడా తమ కరెంట్ బిల్లులు, ఇంటి అద్దెలు కట్టుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నారని ఈ సందర్భంగా గ్రెగ్ అబాట్ గుర్తుచేశారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంక్షలు కొనసాగకూడదని, వెంటనే వ్యాపారాలకు 100 శాతం అనుమతులను ఇస్తున్నామని, ఈ సమయంలో ఇది ఎంతో అవసరమని ఆయన అన్నారు. వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుండడం కూడా ఈ అనుమతులకు ఒక కారణమన్నారు. కాగా.. గడిచిన ఎనిమిది నెలల నుంచి మాస్క్ తప్పనిసరి నిబంధనలు టెక్సాస్లో కొనసాగుతూ వచ్చాయి.