కాబూల్ నుండి దోహాకు 135 మంది భారతీయులు.. నేడు స్వదేశానికి తరలింపు
ABN , First Publish Date - 2021-08-22T16:37:30+05:30 IST
గత కొన్ని రోజులుగా ఆఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ నుండి దోహాకు తరలించబడిన 135 మంది భారతీయులను ఆదివారం రాత్రి స్వదేశానికి పంపిస్తున్నట్లు ఖతార్లోని భారత రాయబార కార్యాలయం ఆదివారం తెలిపింది.
దోహా: గత కొన్ని రోజులుగా ఆఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ నుండి దోహాకు తరలించబడిన 135 మంది భారతీయులను ఆదివారం రాత్రి స్వదేశానికి పంపిస్తున్నట్లు ఖతార్లోని భారత రాయబార కార్యాలయం ఆదివారం తెలిపింది. ఈ మేరకు ఎంబసీ ఓ ట్వీట్ చేసింది. 'ఇటీవల కాబూల్ నుండి దోహాకు తరలించబడిన 135 మంది భారతీయుల మొదటి బ్యాచ్ ఈ రాత్రికి భారతదేశానికి పంపబడుతుంది. భారతీయులను కాబూల్ నుంచి దోహాకు క్షేమంగా తరలించడంలో సహాకరించిన ఖతార్కు ధన్యవాదాలు' అని ఎంబసీ తన ట్వీట్లో పేర్కొంది. అటు కాబూల్ ఎయిర్పోర్టులో ఉన్న 150 మంది భారతీయులను కూడా ఆదివారం స్వదేశానికి తీసుకురానున్నారు. శనివారమే వీళ్లు భారత్కు రావాల్సి ఉంది. అయితే, ఆర్మీ ఎయిర్క్రాఫ్ట్ నిన్న కాబూల్ వెళ్లేందుకు అనుమతి లభించలేదు. దాంతో సీ-17 ఎయిర్ఫోర్స్ విమానాన్ని తజికిస్థాన్లోని అయిని ఎయిర్ బేస్లో నిలిపివేశారు. ఇక యూఎస్ బలగాల కంట్రోల్లో ఉన్నా కాబూల్ ఎయిర్పోర్టు నుంచి తాజాగా భారత విమానానికి అనుమతి దొరికింది. దీంతో ఆదివారం ఈ విమానంలో 150 మందిని భారత్కు తీసుకురానున్నారు.