రంజాన్ రుచులివిగో
ABN , First Publish Date - 2021-04-10T05:30:00+05:30 IST
కొవిడ్ రెండో దశ తీవ్రమవుతున్న ఈ సమయంలో ప్రోటీన్ ఫుడ్ తినడం ఎంతో మేలని వైద్యులు అంటున్నారు. రంజాన్ మాసం కూడా ప్రారంభం అవుతుండడంతో హలీం ఘుమఘుమలు నోరూరిస్తుంటాయి
కొవిడ్ రెండో దశ తీవ్రమవుతున్న ఈ సమయంలో ప్రోటీన్ ఫుడ్ తినడం ఎంతో మేలని వైద్యులు అంటున్నారు. రంజాన్ మాసం కూడా ప్రారంభం అవుతుండడంతో హలీం ఘుమఘుమలు నోరూరిస్తుంటాయి. మరి ఇంట్లోనే ప్రోటీన్ అధికంగా లభించే హలీం, కచ్చీ ఘోష్ బిర్యానీ, షీర్ కుర్మా ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
కచ్చీ ఘోష్ బిర్యానీ
మటన్ బిర్యానీలో...
క్యాలరీలు - 141
ప్రోటీన్ - 5.84గ్రా
ఫ్యాట్ - 4.34గ్రా
కార్బోహైడ్రేట్లు - 19.26గ్రా
కావలసినవి:
బాస్మతి బియ్యం - ఒక కేజీ, మటన్ - ఒక కేజీ, పెరుగు - 200గ్రా, నిమ్మకాయలు - మూడు, కారం - 50గ్రా, ధనియాలపొడి - 50గ్రా, అల్లంవెల్లుల్లి పేస్టు - 50గ్రా, ఉప్పు - 50గ్రా, నూనె - 100ఎంఎల్, ఉల్లిపాయలు - 200గ్రా, కొత్తిమీర - 15గ్రా, పుదీనా - 15గ్రా, బిర్యానీ ఆకు - 5గ్రా, డాల్డా - 15గ్రా, పచ్చిమిర్చి - 100గ్రా, గరంమసాలా - 30గ్రా, నెయ్యి - 200గ్రా.
తయారీ విధానం:
- మటన్ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి. తరువాత అందులో నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్టు, గరంమసాలా, పెరుగు, కొత్తిమీర, పుదీనా, ధనియాలపొడి, నూనె, వేగించిన ఉల్లిపాయలు వేసి మారినేట్ చేసుకోవాలి. కనీసం రెండు, మూడు గంటలపాటు మారినేట్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్పై ఒక పాత్రను పెట్టి కొన్ని నీళ్లు పోయాలి. తరువాత అందులో గరంమసాలా, బిర్యానీ ఆకు వేయాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో బాస్మతి బియ్యం వేసుకోవాలి.
- బియ్యం సగం ఉడికిన తరువాత నీళ్లు వంచేసి పక్కన పెట్టుకోవాలి.
- స్టవ్పై వెడల్పాటి పాత్ర పెట్టి మారినేట్ మటన్ను లేయర్లా వేసుకోవాలి. తరువాత దానిపై సగం ఉడికిన బియ్యం వేయాలి. నెయ్యి వేసుకోవాలి. మూతపెట్టి ఆవిరి
- బయటకు పోకుండా మెత్తటి పిండితో మూయాలి.
- చిన్నమంటపై 20 నుంచి 25 నిమిషాల పాటు ఉడికించాలి. ఎక్స్ట్రా దమ్ కావాలనుకుంటే మూతపై నిప్పుకణికలు వేయాలి.
- స్టవ్పై నుంచి దింపిన తరువాత వేగించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు వేసి వేడి వేడిగా అందించాలి.
మటన్ హలీం
100గ్రాముల హలీంలో పోషకవిలువలు
క్యాలరీలు - 157
ప్రోటీన్ - 9.7గ్రా
ఫ్యాట్ - 6.8గ్రా
కార్బోహైడ్రేట్లు - 15.2గ్రా
కావలసినవి:
బోన్లె్స మటన్ - 600గ్రా, గోధుమ రవ్వ (లావుది) - 300గ్రా, సెనగపప్పు - 50గ్రా, బియ్యం - 50గ్రా, నూనె - 300ఎంఎల్, నెయ్యి - 300ఎంఎల్, కారం - 50గ్రా, పసుపు - 50గ్రా, పచ్చిమిర్చి - 30గ్రా, అల్లం వెల్లుల్లి పేస్టు - 30గ్రా, మిరియాల పొడి - 10గ్రా, నిమ్మకాయలు - మూడు, యాలకులు - 50గ్రా, గరంమసాలా - 50గ్రా, ఉల్లిపాయలు - 200గ్రా, పెరుగు - 100గ్రా, పుదీనా - 50గ్రా, తమలపాకు వేర్లు (పాన్ కి జాద్) - 30గ్రా, ఖాస్ కి జాద్ - 30గ్రా.
తయారీ విధానం:
- మటన్ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి. తరువాత అందులో ఖాస్ కి జాద్, పాన్ కి జాద్ వేసి, తగినన్ని నీళ్లు పోసి 20 నుంచి 25 నిమిషాల పాటు ఉడికించాలి.
- గోధుమరవ్వ, సెనగపప్పు, బియ్యంను అరగంటపాటు నానబెట్టాలి. తరువాత నీళ్లు తీసేసి మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి.
- స్టవ్పై మందంగా ఉండే పాన్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయలు గోధుమ రంగులోకి మారే వరకు వేగించాలి. ఇందులో నుంచి గార్నిష్ కోసం కొన్ని పక్కన పెట్టుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, పెరుగు, పసుపు, కారం, గోధుమరవ్వ-సెనగపప్పు-బియ్యం పేస్టు వేసి కలపాలి.
- ఈ మిశ్రమం వేగిన తరువాత మటన్ వేయాలి. మటన్ ముక్కలకు మసాలా బాగా పట్టేలా కలియబెట్టాలి.
- నిమ్మరసం, మిరియాల పొడి, యాలకులపొడి, గరంమసాలా వేయాలి. పైన నెయ్యి వేసుకోవాలి.
- వేగించి పెట్టుకున్న ఉల్లిపాయలు, పుదీనా ఆకులతో అలంకరించి వడ్డించాలి.
షీర్ కుర్మా
షీర్కుర్మాలో...
క్యాలరీలు - 208
ప్రోటీన్ - 4.2గ్రా
ఫ్యాట్ - 5.85గ్రా
కార్బోహైడ్రేట్లు - 36.65గ్రా
కావలసినవి:
షీర్ సేమ్యా - పావుకేజీ, నెయ్యి - 50 ఎం.ఎల్, పాలు - ఒక లీటరు, జీడిపప్పు - 50గ్రా, యాలకులు - రెండు, పంచదార - 150గ్రా, ఖర్జూరం - 100గ్రా, ఎండుద్రాక్ష - 50గ్రా, పిస్తా - 50గ్రా, కోవా - 20గ్రా, సారపప్పు - 50గ్రా.
తయారీ విధానం:
- ముందుగా సేమ్యాను వేగించి పక్కన పెట్టుకోవాలి.
- డ్రై ఫ్రూట్స్ను ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- స్టవ్పై పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేయాలి. నూనె వేడి అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేగించాలి.
- తరువాత పాలు, పంచదార వేసి కలపాలి.
- ఇప్పుడు కోవా వేసి మరగనివ్వాలి. చివరగా సేమ్యా వేసి మరో రెండు నిమిషాలపాటు ఉడికించి దింపాలి.
- బౌల్లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.
-వెంకట్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ గోల్కొండ హోటల్