కీలక నిర్ణయం: పెళ్లయిన కుమార్తెలు కూడా అర్హులే..!
ABN , First Publish Date - 2021-11-12T14:09:52+05:30 IST
పెళ్లయిన కుమార్తెలు కూడా..
పెళ్లయిన కుమార్తెలు కూడా డిపెండెంట్ కొలువులకు అర్హులు
ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం
లక్నో: కారుణ్య నియామకాల విషయంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసు పూర్తవకముందే ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే... సదరు ఉద్యోగి కుటుంబానికి చెందిన పెళ్లయిన కుమార్తెలను కూడా కారుణ్య నియామకాలకు అర్హులుగా ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం... పెళ్లయిన లేదా పెళ్లికాని కుమారులు, పెళ్లికాని కుమార్తెలను మాత్రమే కారుణ్య నియామకాలకు అర్హులుగా పరిగణిస్తున్నారు. తండ్రి చనిపోతే డిపెండెంట్ కోటాలో ఉద్యోగం పొందే అవకాశం వారికే ఉంది. దీనివల్ల ఒకే కుమార్తె ఉన్న కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
కుమార్తెకు పెళ్లయిన తర్వాత... ఉద్యోగి అయిన తండ్రి చనిపోతే సదరు కుమార్తెకు డిపెండెంట్ కోటాలో ఉద్యోగం పొందే అవకాశం లేదు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పెళ్లయిన కుమార్తెలు కూడా డిపెండెంట్ కోటాలో కారుణ్య నియామకాలకు అర్హులవుతారు. ఈ మేరకు రాష్ట్ర సిబ్బంది వ్యవహారాల విభాగం పంపిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆమోదం తెలిపారు.