జగనన్న సర్కారుకే ఉద్యోగుల అండ

ABN , First Publish Date - 2021-12-07T15:31:43+05:30 IST

ఉద్యోగులు ఎల్లప్పుడూ..

జగనన్న సర్కారుకే ఉద్యోగుల అండ

పీఆర్సీ సహా అన్నీ ఇస్తారు.. తొందరొద్దు

సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలు


అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు ఎల్లప్పుడూ జగనన్న ప్రభుత్వానికే అండగా ఉంటారని ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సంక్షేమం) ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, పీఆర్సీ వంటివాటిని ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘ఉద్యోగ సంఘ నాయకులు సమస్యలపై పోరాటం చేయొచ్చు. కానీ ప్రభుత్వాన్ని కూల్చుతామనడం సబబు కాదు. వారు అలా అని ఉండకపోవచ్చు. జగన్‌ ప్రభుత్వం ఉద్యోగులు, ప్రజలందరి మన్ననలు పొందుతున్న ప్రభుత్వం. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. దీంతో ఉద్యోగులకు రావలసిన రాయితీలు, బకాయిలు సకాలంలో అందలేదు. వైసీపీ అధికారంలోకి రాగానే 27ు ఐఆర్‌ ఇచ్చారు. పీఆర్సీ ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మనందరి కోసం కష్టపడి పని చేస్తున్న సీఎం కోసం మనందరం అండగా నిలుద్దాం. ఏదైనా బాధ కలిగినప్పుడు కుటుంబ సభ్యులుగా ఉద్యోగులు తమ బాధను వ్యక్తం చేస్తారే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఇలాంటి జగనన్న ప్రభుత్వంలో పనిచేయడాన్ని ఉద్యోగులు అదృష్టంగా భావిస్తున్నారు. అయితే కొంతమంది దీనిని వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటిని తిప్పి కొడదాం’’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-07T15:31:43+05:30 IST