NEET రద్దు డిమాండ్కు మద్దతు ఇవ్వండి
ABN , First Publish Date - 2021-10-14T13:58:56+05:30 IST
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్) రద్దు డిమాండ్కు..
![NEET రద్దు డిమాండ్కు మద్దతు ఇవ్వండి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కేటీఆర్కు డీఎంకే ఎంపీల విజ్ఞప్తి
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్) రద్దు డిమాండ్కు మద్దతు ఇవ్వాలని ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును తమిళనాడు అధికార పార్టీ డీఎంకేకు చెందిన ఎంపీలు కోరారు. నగరంలోని తెలంగాణ భవన్లో ఆయన్ను కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించారు. నీట్ రద్దుకు తమిళనాడు ప్రభుత్వం లేవనెత్తిన డిమాండ్కు అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు తమ సీఎం స్టాలిన్ ఇదివరకే నీట్ గురించి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రం ప్రభుత్వంపై సమష్టిగా పోరాడి ఒత్తిడి తీసుకొద్దామని సూచించారు. కేటీఆర్ని కలిసిన వారిలో డీఎంకే ఎంపీలు ఇళంగోవన్, కళానిధి వీరస్వామి తదితరులు ఉన్నారు. భేటీ అనంతరం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోనే ఎంపీ ఇళంగోవన్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని, కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విధానాలపై తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని వివరించారు. కేంద్రంలో కీలకమైన అంశాలపై నిర్ణయం చేసేప్పుడు రాష్ట్రాల అభిప్రాయాలతో పని లేకుండా బీజేపీ సర్కారు నిరంకుశ విధానంలో ముందుకెళ్లోందని ఎంపీలు మండిపడ్డారు. తమ విజ్ఞప్తిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని ఎంపీలు వెల్లడించారు. కాగా.. నీట్ రద్దుకు మద్దతు తెలపాలని కోరుతూ తమిళనాడు సీఎం స్టాలిన్ ఇటీవల 12 బీజేపీయేతర రాష్ర్టాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసిన విషయం తెలిసిందే.