స్థానికతను ప్రామాణికంగా తీసుకోవాలి.. సీఎంకు రేవంత్రెడ్డి బహిరంగ లేఖ
ABN , First Publish Date - 2021-12-30T18:28:16+05:30 IST
ఉద్యోగుల బదిలీల్లో స్థానికతను ప్రామాణికంగా తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న మార్గదర్శకాలను రద్దు చేయాలన్నారు

విభజనపై ఉద్యోగులతో చర్చించాలి
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల బదిలీల్లో స్థానికతను ప్రామాణికంగా తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న మార్గదర్శకాలను రద్దు చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించి నూతన మార్గదర్శకాలను రూపొందించాలని, వాటి ఆధారంగానే బదిలీలు చేపట్టాలన్నారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలు ఉద్యోగ, ఉపాధ్యాయులను మనో వేదనకు గురిచేస్తున్నాయన్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంతో ఉద్యోగులు సొంత జిల్లాల్లోనే స్థానికేతరులుగా మారే ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు. ఉద్యోగుల విభజన, బదిలీల్లో కొత్త జిల్లాల వారీగా స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా ఉమ్మడి జిల్లా యూనిట్గా సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుని పోస్టింగ్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. జీవో 317ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.