ఐఆర్‌ ఎంతో.. ఫిట్‌మెంటూ అంతే!

ABN , First Publish Date - 2021-12-15T13:17:25+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే..

ఐఆర్‌ ఎంతో.. ఫిట్‌మెంటూ అంతే!

27శాతం ఇవ్వాలని 11వ పీఆర్‌సీ సిఫారసు

ఐఎల్‌వో ప్రమాణాలతో పోల్చితే అది ఎక్కువేనని అశుతోశ్‌ కమిషన్‌ చెప్పింది.. సీఎస్‌ కమిటీ వెల్లడి


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే మధ్యంతర భృతి(ఐఆర్‌) 27శాతం ఇస్తున్నందున ఫిట్‌మెంట్‌ కూడా అంతే ఇవ్వాలని 11వ వేతన సవరణ సంఘం(పీఆర్‌సీ) సిఫారసు చేసింది. నిజానికి భారత కార్మిక సంస్థ (ఐఎల్‌వో) ప్రమాణాల ప్రకారం గణిస్తే.. 23శాతం ఫిట్‌మెంటే లెక్కతేలిందని అశుతోష్‌ మిశ్రా నేతృత్వంలోని కమిషన్‌ పేర్కొన్నట్లు సీఎస్‌ సమీర్‌ శర్మ సారథ్యంలోని అధికారుల కమిటీ నివేదిక వెల్లడించింది. కొత్త పే స్కేల్‌ను 2018 జూలై 1నుంచి వర్తింపజేయాలని, నగదు ప్రయోజనం ఎప్పటినుంచి ఇవ్వాలనేది ఆర్థిక వనరులు, డిమాండ్లను అనుసరించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కరువు భత్యం(డీఏ) ప్రస్తుతం ఏడాదికి రెండు సార్లు ఇస్తున్నట్లే కొనసాగించాలని సిఫారసు చేసింది. కేంద్ర ధరల ప్రకారం భత్యం 1-1-2016 నుంచి స్కేళ్లలో కలిసిపోయింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం 1-7-2018 నుంచి స్కేల్‌లో కలుస్తుంది. ఇందువల్ల కేంద్రం ఒక శాతం డీఏ ప్రకటిస్తే రాష్ట్రం 0.91 శాతం డీఏను 1-1-2019 నుంచి మంజూరు చేయాలని పీఆర్‌సీ సిఫారసు చేసింది.


పేస్కేల్స్‌కు సంబంధించి మాస్టర్‌ స్కేల్‌ను కొనసాగించాలని, 32 గ్రేడ్‌ల్లో ఉండాలని, గతంలో 81 స్టేజీలుగా ఉన్న వాటిని 83 స్టేజీలకు పెంచాలని, మాస్టర్‌ స్కేల్‌ తొలిస్టేజీల్లో ఏటా 3శాతం ఇంక్రిమెంట్‌.. చివరి స్టేజీల్లో 2.34 శాతం ఇంక్రిమెంట్లు పెంపు ఉండాలని సూచించింది. మాస్టర్‌ స్కేల్‌లో ఇంక్రిమెంట్‌ పెంపు.. దశలవారీగా తొలి మూడేళ్లలో 72వ స్టేజీ వరకు ఉండాలని.. నాలుగో సంవత్సరం 73-80 స్టేజీల వరకు, ఆ తర్వాత మిగిలిన స్టేజీల్లో పెరుగుదల ఉండాలని పేర్కొంది. కొత్త పేస్కేల్‌లో 1-7-2018 నాటికి వంద శాతం కరువు భత్యం కలిపి కొత్త మూలవేతనం నిర్ధారిస్తారు. దానిపై ఫిట్‌మెంట్‌ లెక్కిస్తారు. కనీస వేతనం రూ.20వేలు, గరిష్ఠ వేతనం రూ. 1,79,000. పేస్కేల్‌పై స్తబ్ధత ఏర్పడిన పరిస్థితుల్లో ఐదు స్టాగ్నేషన్‌ ఇంక్రిమెంట్లు వరకు ఇవ్వాలని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే ఆర్టీసీ ఉద్యోగులకు మాస్టర్‌ స్కేల్స్‌, పింఛను ఎంచుకునే అవకాశం కల్పించాలని సూచించింది. సీఎస్‌ కమిటీ చెప్పినదాని ప్రకారం.. పీఆర్‌సీ ఇంకా ఏయే సిఫారసులు చేసిందంటే..


వారికి ఇంటి అద్దె భత్యం వద్దు

రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు ఇస్తున్న 30% ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) ఇక కొనసాగించనక్కర్లేదు. వారికి నెలకు గరిష్ఠంగా రూ.26 వేలు మించకుండా ఇవ్వాలి. అమరావతికి వచ్చి ఉచిత వసతి పొందుతున్న ఉద్యోగులందరికీ మూలవేతనంపై 8శాతం హెచ్‌ఆర్‌ఏ కొనసాగించాలి. గరిష్ఠంగా రూ.2,600 చెల్లించాలి.


సీసీఏ..

ఏపీలో సిటీ కాంపెన్సేటరీ భత్యం(సీసీఏ) చెల్లించేందుకు రెండు శ్లాబుల ప్రతిపాదన. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు ఒక శ్లాబు (రూ.400 నుంచి వెయ్యికి పెంపు), మరో 12 కార్పొరేషన్లలో ఉద్యోగులకు రెండో శ్లాబు (రూ.400 నుంచి రూ.750కి పెంపు) ఉండాలి. ఉన్నత విద్యార్హతలు సాధించిన ఉద్యోగులకు సాధారణ పరిస్థితుల్లో ఎలాంటి ప్రత్యేక ఇంక్రిమెంట్లూ ఇవ్వకూడదు. భవన నిర్మాణ/ వ్యక్తిగత వాహనాల కొనుగోలుకు అవసరమైన రుణాలను ఆర్థిక సంస్థలతో మాట్లాడి ప్రభుత్వం ఒప్పించాలి. ప్రతినెలా ఉద్యోగుల వేతనం నుంచి వాయిదాల చెల్లింపు జరగాలి. 


నాన్‌టీచింగ్‌ మహిళా సిబ్బందికీ ఐదు సీఎల్స్‌

మహిళా టీచర్లతో సమానంగా నాన్‌ టీచింగ్‌ విభాగంలోని మహిళా ఉద్యోగులకు అదనంగా 5క్యాజువల్‌ లీవ్స్‌ ఇవ్వాలి. ఇద్దరి కంటే తక్కువ పిల్లలున్న మహిళా ఉద్యోగులు ఏడాది లోపు వయసున్న శిశువును దత్తత తీసుకుంటే 180 రోజులు సెలవివ్వాలి. శిశుసంరక్షణ సెలవులను 180 రోజులకు పొడిగించాలి. దివ్యాంగులైన ఉద్యోగులు కృత్రిమ అవయవాలను మార్చుకునేందుకు 7రోజులు ప్రత్యేక క్యాజువల్‌ లీవ్‌ మంజూరుచేయాలి. నర్సింగ్‌ స్టాఫ్‌కూ దీనిని వర్తింపచేయాలి.


‘పొరుగు’ ఆస్పత్రుల్లో ఈహెచ్‌ఎస్‌

ఈహెచ్‌ఎస్‌ పథకాన్ని ఆర్థికంగా సుస్థిరపరిచేందుకు ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ను దశలవారీగా పెంచాలి. అదే స్థాయిలో ప్రభుత్వ భాగస్వామ్యమూ పెరగాలి. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అదనపు నిధులు విడుదల చేసి.. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల బకాయిలు చెల్లించాలి. పెన్షనర్లకు, వారి భార్య/భర్తకు వార్షిక ఆరోగ్య పరీక్షల సదుపాయం. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఎంప్యానెల్‌ జాబితాలో ఉన్న ఆస్పత్రుల్లో ఈహెచ్‌ఎస్‌ పథకం కింద వైద్యం అందేలా చూడాలి. పూర్తికాలపు కంటింజెంట్‌ ఉద్యోగులు, ఒప్పంద ఉద్యోగులకు నెలకు రూ.20వేల పారితోషికం చెల్లించాలి. పూర్తికాలపు కంటింజెంట్‌/డెయిలీవేజ్‌/కన్సాలిడేటెడ్‌ పే/ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులకు డీఏ చెల్లించాలి. ప్రభుత్వంలోని రెగ్యులర్‌ ఉద్యోగుల్లో వారితో సమానమైన కేటగిరీ ఉద్యోగులతో సమానంగా కనీస వేతన స్కేళన్లు అమలు చేయాలి. పోలీసు కానిస్టేబుళ్లకు సవరించిన వేతన స్కేళ్లకు అనుగుణంగా, వారికి చెల్లించే 30రోజుల కనీస వేతనంలో ఒక వంతును హోం గార్డులకు రోజువారీ అలవెన్సుగా చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించినట్లే వారికి డీఏ చెల్లించాలి. హోంగార్డులు రోజువారీ విధులు నిర్వర్తించే చోటు నుంచి 8కి.మీ దాటి వెళ్లి బందోబస్తు డ్యూటీ నిర్వహించాల్సి వస్తే కానిస్టేబుళ్లతో సమానంగా టీఏ/డీఏ ఇవ్వాలి. 


మానవ వనరుల కల్పన..

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మానవ వనరులు సృష్టించుకోవాలి. ప్రతి ప్రభుత్వ విభాగం నియామక ప్రణాళికను రూపొందించుకోవాలి. ఏపీపీఎస్సీ/డీఎస్సీ ద్వారా గానీ, ఒప్పంద ప్రాతిపదికనగానీ పోస్టులు భర్తీ చేయాలి. ఒప్పంద ఉద్యోగులను తాత్కాలిక పోస్టుల్లోనే నియమించాలి. శాశ్వత ఉద్యోగులు నిర్వర్తించాల్సిన పోస్టుల్లో వారిని నియమించకూడదు. అన్ని అర్హతలూ ఉండి పారదర్శక నియామక ప్రక్రియ ద్వారా నియమితులైన ఒప్పంద ఉద్యోగులను పర్మనెంట్‌ పోస్టులు ఖాళీ అయినప్పుడు రెగ్యులరైజ్‌ చేయవచ్చు. క్లీనింగ్‌, మెయింటినెన్స్‌, సెక్యూరిటీ, బిల్‌ కలెక్షన్‌, రిసెప్షన్‌ డెస్క్‌ల నిర్వహణ, వాహనాల సరఫరా, డ్రైవర్లు వంటి పోస్టుల్లో మాత్రమే పొరుగు సేవల ఉద్యోగులను నియమించాలి. ఏ ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగినీ నేరుగా నియమించుకోకూడదు. 


ఇతర అలవెన్సులు...

మైలేజీ అలవెన్సును పెట్రోలు వాహనాలకు కిలోమీటరుకు రూ.15.50కి, మోటార్‌ సైకిళ్లకు రూ.6.40కి పెంచాలి. డెయిలీ అలవెన్స్‌, లాడ్జింగ్‌ చార్జీలను 33 శాతం పెంచాలి. రాష్ట్రం లోపల డెయిలీ అలవెన్సును రోజుకు రూ.300-600, రాష్ట్రం వెలుపల టూరుకు వెళ్తే రూ.400-800 చొప్పున ఇవ్వాలి.


- కోర్టు మాస్టర్లు, హైకోర్టు న్యాయమూర్తులకు, ఏపీఏటీ న్యాయమూర్తుల వ్యక్తిగత కార్యదర్శులకు కన్వేయన్స్‌ చార్జీలను గరిష్ఠంగా రూ.5 వేలకు పెంచాలి. 

- పశుసంవర్థక, సహకార, పట్టు పరిశ్రమ, పాఠశాల విద్య, పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమశాఖలోని ఇంజనీరింగ్‌ తదితర విభాగాల ఉద్యోగులను ఫిక్స్‌డ్‌ ట్రావెలింగ్‌ అలవెన్సు (ఎఫ్‌టీఏ) పరిధిలోకి తీసుకురావాలి. ప్రస్తుతం నెలకు రూ.1,200గా ఉన్న ఎఫ్‌టీఏని రూ.1,700కు పెంచాలి. 

ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఒక్కో సంతానానికి సంవత్సరానికి రూ.2,500కి పెంచాలి. గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు ఇది వర్తింపజేయాలి.

మరణించిన ఉద్యోగులకు మట్టి ఖర్చులను రూ.20 వేలకు పెంచాలి. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇచ్చే ప్రత్యేక అలవెన్సును రూ.700 నుంచి రూ.1,800కి పెంచాలి.

పశుసంవర్థక, అటవీ శాఖల వంటి విభాగాల్ని రిస్క్‌ అలవెన్స్‌ పరిధిలోకి తీసుకురావాలి.

Updated Date - 2021-12-15T13:17:25+05:30 IST