ఫీజు రీయింబర్స్మెంట్ నగదు తల్లుల ఖాతాల్లో వేస్తే నష్టమేంటి?
ABN , First Publish Date - 2021-12-28T21:16:13+05:30 IST
విద్యాదీవెన అనేది ప్రభుత్వ పథకమని.. ఏ విధంగా డబ్బులు చెల్లించాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించింది. పథకానికి కేంద్రం నిధులు ఇస్తున్నా.. సింగిల్ జడ్జి వద్ద కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చలేదని గుర్తు చేసింది
![ఫీజు రీయింబర్స్మెంట్ నగదు తల్లుల ఖాతాల్లో వేస్తే నష్టమేంటి?](https://media.andhrajyothy.com/appimg/galleries/1921122803420458/12282021154550n44.jpg)
పిటిషనర్లనుద్దేశించి హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు
సింగిల్ జడ్జి తీర్పుపై స్టే.. విచారణ వాయిదా
అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద అందించే ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్మును కళాశాలల అకౌంట్లలోనే జమ చేయాలని, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయడానికి వీల్లేదని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం స్టే విధించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు సూచించింది విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విద్యాదీవెన పథకం కళాశాలల కోసం కాదని, విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజు చెల్లించకపోతే.. యాజమాన్యానికి ఉన్న హక్కుల మేరకు వాటిని వసూలు చేసుకోవచ్చని తెలిపింది. తల్లుల ఖాతాల్లో సొమ్ము జమ చేయడం వల్ల పిటిషనర్ల హక్కులకు ఏ విధంగా భంగం కలుగుతుందో చెప్పాలని ప్రశ్నించింది.