గురుకుల పాఠశాల విద్య నా భవిష్యత్తుకు పునాది వేసింది
ABN , First Publish Date - 2021-12-27T18:51:56+05:30 IST
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం సర్వేల్లోని గురుకుల పాఠశాల దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఇది హర్షించదగ్గ విషయమని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
డీజీపీ మహేందర్రెడ్డి వ్యాఖ్య
కీసర రూరల్, డిసెంబరు 26 : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం సర్వేల్లోని గురుకుల పాఠశాల దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఇది హర్షించదగ్గ విషయమని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. ఆదివారం ఈ పాఠశాల స్వర్ణోత్సవాలను పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా నాగారంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సుల్తానియా మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థులంతా కలిసి పాఠశాల స్వర్ణోత్సవాలు నిర్వహించటం సంతోషంగా ఉందని అన్నారు. తనకు ఈ గురుకులంలో విద్యనభ్యసించే అవకాశం లభించలేదని గుర్తు చేసుకున్నారు. పాఠశాల పూర్వ విద్యార్థి, డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన వారు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదిగారని అన్నారు. తాను ఈ పాఠశాలలో చేరటంతోనే తన ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు పడ్డాయన్నారు. పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభీ వాణీదేవి, కుమారుడు పీవీ ప్రభాకర్రావు మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన అందించాలని, అక్షరాస్యతతోనే పేదరికం పోతుందని తమ తండ్రి అనే వారని గుర్తు చేసుకున్నారు.