సీఎస్‌ను రీకాల్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-12-15T15:02:51+05:30 IST

పీఆర్సీపై తప్పుడు నివేదిక ఇచ్చి 13లక్షల మంది ఉద్యోగులను మోసం చేయాలని చూస్తున్న సీఎస్‌ సమీర్‌ శర్మను ప్రభుత్వం..

సీఎస్‌ను రీకాల్‌ చేయాలి

కమిటీలోని అధికారులను సస్పెండ్‌ చేయాలి

ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి డిమాండ్‌ 


కర్నూలు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): పీఆర్సీపై తప్పుడు నివేదిక ఇచ్చి 13లక్షల మంది ఉద్యోగులను మోసం చేయాలని చూస్తున్న సీఎస్‌ సమీర్‌ శర్మను ప్రభుత్వం రీకాల్‌ చేయాలని ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి నాయకులు డిమాండ్‌ చేశారు. నిరసనగా కర్నూలు కలెక్టరేట్‌ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఏపీ జేఏసీ కర్నూలు జిల్లా చైర్మన్‌ సీహెచ్‌ వెంగళరెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీకి సంబంధించి అశుతోష్‌ మిశ్రా నివేదికను బయట పెట్టకుండా, ఐఏఎస్‌ అధికారులు రజత్‌భార్గవ్‌, శశిభూషణ్‌, రావత్‌ అందించిన రిపోర్టును చూపించారన్నారు. ఇది ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడమేనని, ప్రభుత్వ ఉద్యోగులను అవమానించడమేనన్నారు. ప్రభుత్వం వెంటనే కమిటీలోని అధికారులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పట్టించుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సీఎస్‌, ముగ్గురు ఐఏఎ్‌సలకు వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేశారు. సీఎస్‌ కమిటీ నివేదిక ప్రతులు తగులబెట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్‌ గిరికుమార్‌రెడ్డి, ఏపీఎన్జీవో జిల్లా కార్యదర్శి జవహర్‌లాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-15T15:02:51+05:30 IST