పీజీ ప్రవేశాలకూ ‘కామన్ టెస్ట్’
ABN , First Publish Date - 2021-01-13T15:30:33+05:30 IST
పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల ప్రవేశాలకూ 2021-22 విద్యా సంవత్సరం నుంచి ‘కామన్ టెస్ట్’ విధానం అమల్లోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్
![పీజీ ప్రవేశాలకూ ‘కామన్ టెస్ట్’](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
త్వరలో హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు ఏర్పాటు
ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి
అమరావతి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల ప్రవేశాలకూ 2021-22 విద్యా సంవత్సరం నుంచి ‘కామన్ టెస్ట్’ విధానం అమల్లోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. దీని ప్రకారం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అఫిలియేటెడ్ కాలేజీల్లో ప్రవేశాలకు రాష్ట్ర స్థాయిలో ఒకే పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించి అభ్యర్థులకు కామన్ ర్యాం కులు కేటాయిస్తారని, ర్యాంకుల మెరిట్ ప్రాతిపదికన విశ్వవిద్యాలయాలే తమ అడ్మిషన్లు చేసుకుంటాయని వెల్లడించారు. ‘ఇప్పటి వరకు విశ్వవిద్యాలయాలే పీజీ అడ్మిషన్లకు విడివిడిగా ఆన్లైన్లో ప్రవేశ పరీక్ష నిర్వహించి, కౌన్సెలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తున్నాయి.
దీంతో విద్యార్థులు రెండు, మూడు వర్సిటీలకు దరఖాస్తు చేసుకుని పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఉండేది. ఫలితంగా విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజుల భారం పడటంతో పాటు రిస్క్ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వచ్చే విద్యా సంవత్సరం నుంచి కా మన్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించాం’అని హేమచంద్రారెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల కోణం లో ఆలోచించి పీజీ అడ్మిషన్లకు ఒకే పరీక్ష నిర్వహించాలన్న ప్రతిపాదన రాగా.. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గ్రీన్సిగ్నల్ ఇచ్చిందన్నారు. మరోవైపు.. త్వరలో హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు ఏర్పాటు చేస్తామని, దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు.