జీవో నంబర్-77ను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2021-12-30T21:14:46+05:30 IST
ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదువుతున్న విద్యార్థులకు శాపంగా మారిన జీవో నంబర్-77ను రద్దు చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో
![జీవో నంబర్-77ను రద్దు చేయాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/1921123003435148/12302021154436n15.jpg)
ఏయూ మెయిన్ గేటు వద్ద ఏఐఎస్ఎఫ్ ఆందోళన
విశాఖపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదువుతున్న విద్యార్థులకు శాపంగా మారిన జీవో నంబర్-77ను రద్దు చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏయూ మెయిన్ గేటు వద్ద బుధవారం ఆందోళన నిర్వహించారు. నిరుపేద విద్యార్థులకు గుదిబండగా మారిన ఈ జీవోను రద్దు చేయడంతోపాటు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షి్పలను గతంలో మాదిరిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు యు.నాగరాజు, విశాఖ, విజయనగరం జిల్లా కార్యదర్శులు జి.ఫణీంద్రకుమార్, నాగభూషణం మాట్లాడుతూ పీజీ విద్యార్థులను చదువుకు దూరం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్-77ను తీసుకువచ్చిందని విమర్శించారు. ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంటెక్, ఎం.ఫార్మసీ వంటి కోర్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని, ఈ జీవో వల్ల పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా వున్న సుమారు 2,500 ప్రొఫెసర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్కు చేరుకుని కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి సభ్యులు అభి, చైతన్య, సూర్య, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.