విద్యావంతులు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి
ABN , First Publish Date - 2021-12-31T20:59:11+05:30 IST
విద్యావంతులంతా సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు

దివాన్చెరువు, డిసెంబరు 30: విద్యావంతులంతా సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు. సమాజసేవలో కళాశాలల పాత్ర ఎంతో కీలకమైనదని చెప్పారు. విశ్వవిద్యాలయంలో గురువారం బోర్డ్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ త్రూ ఎడ్యుకేషన్(బీసీడీఈ) అనే ఆన్లైన్ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని గురు వారం నిర్వహించారు. దీనికి వీసీ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. బీసీ డీఈ కార్యక్రమంలో భాగంగా విశ్వవిద్యాలయ పరిధిలో ప్రతీ మండలానికి వంద మంది విద్యార్థులు క్షేత్రస్ధాయిలో కమ్యూనిటీ సేవలు అందించే విధంగా ప్రణాళిక రూపొందించాలన్నారు. కళాశాలలకు అవసరమైన మార్గదర్శకాలు విశ్వవిద్యాలయం ద్వారా అందిస్తామని చెప్పారు. సమాజ సేవలకు సంబం ధించి ప్రత్యేక బృందాలను వర్సిటీ, కళాశాలల స్థాయిలోను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మెరుగైన సమాజ నిర్మాణానికి విశ్వవిద్యాలయం, కళాశాలలు, విద్యా వేత్తలు, విద్యార్థులు భాగస్వాములవ్వాలని కోరారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.టేకి నిర్వహించిన ఈ కార్యక్రమం లో విశ్వవిద్యాలయం అధికార్లు, అధ్యాపకులు, అనుబంధ కళాశాలల యాజ మాన్యాలు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.