రాష్ట్రానికి మరో 9 ప్రైవేటు వర్సిటీలు

ABN , First Publish Date - 2021-12-09T15:46:52+05:30 IST

ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు..

రాష్ట్రానికి మరో 9 ప్రైవేటు వర్సిటీలు

ఎడ్యుకేషనల్‌ హబ్‌గా హైదరాబాద్‌

ఉన్నత విద్యాశాఖ  కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌


హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు సైతం డిగ్రీలను చూడకుండా నైపుణ్యం ఉన్నవారికే పెద్దపీట వేస్తున్నాయని, నేటి తరానికి విద్యార్హత కన్నా నైపుణ్యం ముఖ్యమని ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ అన్నారు. ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ విద్యాశాఖ సంయుక్తంగా బుధవారం తాజ్‌ దక్కన్‌లో నిర్వహించిన ‘తెలంగాణ ఫ్యూచర్‌ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేగంగా మా రుతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో పెనుమార్పులు రావాల్సిన అవసరముందన్నారు. ‘‘దేశంలో విద్యారంగంలో రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. ప్రస్తుత ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలకు తోడు మరో 9 ప్రైవేటు యూనివర్సిటీలు రాష్ట్రంలో రానున్నాయి. హైదరాబాద్‌ త్వరలోనే విద్య రాజధానిగా మారనుంది. డిగ్రీ కోర్సుల్లో క్లస్టర్‌ విధానం అమలులోకి తీసుకురావడం ద్వారా ఆసక్తి ఉన్న విద్యార్థులు తమకు నచ్చిన కోర్సును ఎంచుకునే అవకాశముంటుంది’’ అని నవీన్‌ తెలిపారు.


విద్యాసంస్థలు, వర్సిటీలను అనుసంధానం చేయాల్సిన ఆవశ్యకతను తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి వివరించారు. అదే విధంగా విద్యార్థులకు ఆయా సంస్థలో ఇంటర్న్‌షిప్‌ సౌకర్యం అందించాలన్నారు. రాష్ట్రంలో 2013లో 14 డిగ్రీ కాలేజ్‌లకు న్యాక్‌ గుర్తింపు ఉండగా.. ప్రస్తుతం వీటి సంఖ్య 88కి చేరిందన్నారు. భారతీయ ప్రాచీన గురుకుల విధానం వల్ల ఉపయోగాలుంటాయని ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి అన్నారు. వర్సిటీలకు తగినంత నిధులు ఇచ్చి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ఉస్మానియా వర్సిటీ వీసీ డాక్టర్‌ డి. రవీందర్‌ అన్నారు.

Updated Date - 2021-12-09T15:46:52+05:30 IST