బాలల హక్కుల కమిషన్ నియామకాలేవి?
ABN , First Publish Date - 2021-07-23T09:27:56+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్, సభ్యుల నియామకం కోసం గత ఏడాది మహిళా, బాలల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్, సభ్యుల నియామకం కోసం గత ఏడాది మహిళా, బాలల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించింది. సమర్థులు, అర్హులైన పలువురు ఆ పదవులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం కూడా సదరు చైర్మన్, సభ్యుల నియామకం కోసం గత ఏప్రిల్ 7వ తేదీన జిఓఆర్టి 55ని జారీచేసింది. మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి సారథ్యంలో ఆంధ్రప్రదేశ హైకోర్టు రిజిసా్ట్రర్ జనరల్ బి.ఎస్ భానుమతి, ఎమ్మెల్యే కె.వి ఉషశ్రీ సభ్యులుగా ఎంపిక కమిటీని నియమించింది. ప్రభుత్వం జీవో ఇచ్చి మూడు నెలలు గడుస్తున్నా నేటికీ ఈ నియామకాలపై మహిళా, శిశు సంక్షేమ శాఖ దృష్టి సారించక పోవటం శోచనీయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి నాడు–నేడు, అమ్మఒడి తదితర పథకాల ద్వారా పాఠశాలలు, అంగన్వాడీలలో జవాబుదారీతనం కోసం ప్రయత్నిస్తున్నారు. వీటన్నింటిలో మరింత జవాబుదారీతనం, పారదర్శకత తీసుకురావడంలో ముఖ్యభూమిక పోషించగలిగే బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నియామకాలపై మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు అంతగా శ్రద్ధ చూపుతున్నట్లు లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే కమిషన్ నియామకాలు జరిపి బాలల హక్కులను, ప్రయోజనాలను కాపాడడంపై దృష్టి సారించాలి.
టేకి సురేష్ కుమార్
రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా