పింఛను లెక్కింపులో అన్యాయం
ABN , First Publish Date - 2021-09-04T05:50:44+05:30 IST
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన పింఛను నిబంధనల ప్రకారం సర్వీసును లెక్క కట్టి పింఛను ఇస్తున్నారు. వారి చివరి నెల మూల వేతనాన్ని అర్హత గల సర్వీసు సంవత్సరాలతో గుణించి దానిని 66తో భాగించగా వచ్చే మొత్తాన్ని.....
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన పింఛను నిబంధనల ప్రకారం సర్వీసును లెక్క కట్టి పింఛను ఇస్తున్నారు. వారి చివరి నెల మూల వేతనాన్ని అర్హత గల సర్వీసు సంవత్సరాలతో గుణించి దానిని 66తో భాగించగా వచ్చే మొత్తాన్ని పింఛనుగా ఇస్తున్నారు. ఉదాహరణకు మూలవేతనం రూ.26400 ఉంటే దానిని 33 సంవత్సరాలతో గుణించగా వచ్చే మొత్తం రూ.8,71,200. దానిని 66తో భాగించగా వచ్చే 13,200 రూపాయిలు పింఛను అవుతుంది.
ఒక ఉద్యోగి 40 సంవత్సరాలు సర్వీసు ఉన్నపటికీ 33 సంవత్సరాలకే పింఛను లెక్కింపును పరిమితం చేస్తున్నారు. ఆ పై సంవత్సరాల సర్వీసుకు పింఛను ఇవ్వడం లేదు. 40 సంవత్సరాల సర్వీసు ఉన్న ఉద్యోగికి 16 వేల రూపాయల పింఛను రావాల్సిఉండగా రూ.13,200 మాత్రమే లభిస్తోంది. ప్రస్తుతం ఉద్యోగ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచడం వల్ల గరిష్ఠ సర్వీసు 43సంవత్సరాలు ఉంటుంది. అయినా 10 ఏళ్ల సర్వీసుకు పింఛన్ లెక్కల్లో పరిగణించడం లేదు. ఆఫీసు సబార్డనేట్ ఉద్యోగుల విషయంలో 12 ఏళ్ళ సర్వీసు వరకు పింఛన్ లెక్కల్లో పరిగణించడం లేదు. పింఛన్ నిబంధనలలో సర్వీసును 33 ఏళ్ళకే పరిమితం చేయాలని ఎక్కడా లేదు. ఇది గుర్తించక చాలా మంది 43 ఏళ్ళ వరకు లెక్కించాల్సిన పింఛన్ను 33 ఏళ్ళకే లెక్కించి ఇస్తున్నా అదే పూర్తి పింఛన్గా భావిస్తున్నారు. సర్వీసులో ఉన్నప్పుడు ఇచ్చిన జీతంలో మినహాయించిన మొత్తాన్ని పింఛన్ అంటున్నారు. అయినా ప్రభుత్వం మొత్తం సర్వీసును పరిగణనలోకి తీసుకోవడంలేదు.
33 ఏళ్ళకు తక్కువ సర్వీసు ఉన్నవాళ్ళకు 5 ఏళ్ళ వరకు కలిపి 33 సంవత్సరాలకు మించకుండా పింఛన్ మొత్తాన్ని లెక్కిస్తున్నారు. 33ఏళ్ళకు పైగా చేసినవారికి మాత్రం అలా లెక్కించడంలేదు. గ్రాట్యుటీ విషయంలో కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తున్నారు. దీనివల్ల 40 ఏళ్ళ సర్వీసు ఉన్నవారికి తక్కువ పింఛను, గ్రాట్యుటీ వస్తున్నాయి. 2004 సెప్టెంబరు నుంచి నియమితులైన వారికి ఈ సూత్రానికి బదులు సిపిఎస్ను వర్తింపచేస్తున్నారు.
ఆర్. విజయ ప్రసాద్