బంగ్లా హిందువులకు బాసట!
ABN , First Publish Date - 2021-10-29T06:21:02+05:30 IST
బంగ్లాదేశ్లో హిందువులు పూజలు చేసుకోవడం నేరం అయిపోయింది. దుర్గామాతను ప్రతిష్టించి కొలిచే నవరాత్రులు కాలరాత్రులుగా మారాయి. అలంకరించిన మండపాలను, హిందువుల ఇళ్లను కూల్చివేసి...
బంగ్లాదేశ్లో హిందువులు పూజలు చేసుకోవడం నేరం అయిపోయింది. దుర్గామాతను ప్రతిష్టించి కొలిచే నవరాత్రులు కాలరాత్రులుగా మారాయి. అలంకరించిన మండపాలను, హిందువుల ఇళ్లను కూల్చివేసి, కాల్చివేస్తున్నాయి అక్కడి మతఛాందస శక్తులు. అత్యాచారాలు, హత్యలు సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా మానవ హక్కుల సంఘాలు నోరువిప్పడం లేదు. హిందూమైనారిటీల హక్కులు, అవస్థలు ఎవరికీ పట్టడం లేదు. బంగ్లాదేశ్లోని 22 జిల్లాలలో ఇళ్ళు, గోదాములు, గడ్డివాములు, పశువులూ మంటల్లో కాలి బూడిదయ్యాయి. ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న లెక్కలకు మించి నష్టం వాటిల్లింది. అప్పటికే కొద్దికాలంగా పథకం ప్రకారం హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం, వారి ఆస్తులకు నష్టం చేయడం, దాడులతో భయపెట్టడం వంటివి జరిగాయి. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ బంగ్లాదేశ్లో పర్యటించిన సందర్భంగానూ అక్కడి హిందువులపై దాడి జరిగింది. దేవాలయాలను ధ్వంసం చేశారు, కొందరిని హత్య చేశారు.
ఖురాన్కు అవమానం జరిగినట్లుగా ప్రచారంలోకి వచ్చిన ఒక వీడియో ఆధారంగా అల్లర్లకు దిగటం అరాచకం. నిత్యం ఇలా ఏదో సాకుతో దాడులకు పాల్పడడం ముస్లిం ఛాందసవాదులకు అలవాటుగా మారింది. హిందువుల వ్యాపారాలు దెబ్బతీయడం, దుకాణాలను లూటీ చేయడం, తగలబెట్టడం పరిపాటి. ఈ ఘోర పరిణామాలు చూసి ప్రముఖ రచయిత్రి తస్లిమా నస్రీన్-- చేసిన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దంపడతాయి. ‘అది బంగ్లాదేశ్ కాదు.. జిహాదిస్థాన్. మదర్సాలలో పిల్లలకు మత విద్వేషం నూరిపోస్తున్నారు. హిందువులను, బౌద్ధులను కనీసం మనుషుల్లాగా చూడటం లేదు. గత ప్రధానమంత్రులలాగానే షేక్ హసీనా కూడా మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు’’ అని అన్నారామె. బేగంగంజ్ అనే ఒక పట్టణంలో ఇటీవల ఒక శుక్రవారం ప్రార్థనలు ముగిసినవెంటనే అల్లరిమూకలు మండపంలోకి చొరబడి దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేసి, ఆలయ కమిటీ సభ్యుడిని కత్తులతో పొడిచి హత్య చేశారు, అక్కడే ఉన్న కొంతమంది భక్తులను చంపేసి పక్కన ఉన్న చెరువులో పడవేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ మారణహోమాన్ని ఆపాల్సిందిపోయి చోద్యం చూస్తూ ఉండిపోయింది.
వాస్తవానికి 1947లో భారతదేశం మత ప్రాతిపదికన రెండుగా విడిపోయినప్పటినుంచి ఇటు పాకిస్తాన్, అటు బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. వారి జీవన హక్కులను అల్లరిమూకలు అన్యాయంగా, అకారణంగా కాల రాస్తున్నాయి. 1947–1950 మధ్యలో బంగ్లాదేశ్ ప్రాంతంలో అధికారిక అంచనాల ప్రకారం 20లక్షలమంది హిందువులు హత్యకు గురయ్యారు. యాభైలక్షలమంది హిందూ శరణార్థులు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని భారతదేశంలో తలదాచుకున్నారు. 1964–1971లో సైతం బంగ్లాదేశ్ ప్రాంతంలో అల్ప సంఖ్యాకులైన హిందువులపై మారణకాండ సాగింది. 1971 యుద్ధ సమయంలో లక్షలమంది హిందూ మహిళలు, పిల్లలు చంపబడ్డారు. పాకిస్థాన్ సైనికుల అఘాయిత్యాలకు, అత్యాచారాలకు గురై వేలాదిమంది ప్రాణాలను కోల్పోయారు.
దురదృష్టం ఏమిటంటే, బంగ్లాదేశ్ వేరుపడిన తరువాత కూడా అక్కడి అల్పసంఖ్యాక హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
దేశ విభజన కాలంలో పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)లలో అధికసంఖ్యలో ఉన్నటువంటి హిందువులు నేడు అల్ప సంఖ్యాకులై జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు. మతఛాందసమూకల చేతిలో నరకం అనుభవిస్తున్నారు. దాడులు ఇలాగే కొనసాగితే పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో 8 శాతంగా ఉన్న హిందువుల మనుగడ ప్రశ్నార్థకమే! 2050 నాటికి ఈ 8 శాతం సున్నాకి చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణహోమంపై విశ్వహిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులపై దాడులను నిలువరించాలనీ, ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయి పరిశీలనాకమిటీ, నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఉగ్రదాడులపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి మానవ హక్కులను కాపాడవలసిందిగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ను విహెచ్పి కోరింది. హిందువుల ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్న ఉగ్రవాదులను గుర్తించి చట్టం ప్రకారం శిక్షించి, బంగ్లాదేశీ హిందువుల జీవన హక్కును కాపాడాలని కోరుతోంది. హిందువులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను ప్రతి మానవతావాది కులమతాలకు అతీతంగా ఖండించాలి. ఓటు బ్యాంకు రాజకీయాలకు తావు లేకుండా మత స్వేచ్ఛను గౌరవించాలి.
పగుడాకుల బాలస్వామి
(విశ్వహిందూ పరిషత్)