కేపీహెచ్బీలో మహిళ దారుణ హత్య
ABN , First Publish Date - 2021-01-07T11:44:44+05:30 IST
కేపీహెచ్బీకాలనీలో మహిళ హత్యకు గురైంది. ఖమ్మం జిల్లా ఇల్లందుకు
హైదరాబాద్/హైదర్నగర్ : కేపీహెచ్బీకాలనీలో మహిళ హత్యకు గురైంది. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన వెంకటేశ్వర్లు, స్రవంతి నగరానికి వచ్చారు. గత డిసెంబర్ 5న కేపీహెచ్బీకాలనీ సమీపంలోని శ్రీసత్యనారాయణ కాలనీలో ఫ్లాట్ నెంబర్ 75,76 వెళ్లారు. ఇంటి యజమాని రంగస్వామికి తాము భార్యాభర్తలమని, చెట్లకు వాడే మందులు విక్రయిస్తున్నామంటూ ఇంటిని అద్దెకు తీసుకొన్నారు. ఈ నెల 5న వెంకటేశ్వర్లు ఇంటి యజమాని రంగస్వామికి ఫోన్చేసి తాను ఇంటిని ఖాళీ చేస్తున్నామని చెప్పి... వెళ్లిపోయాడు. అదేరోజు సాయంత్రం ఇంటిని శుభ్రం చేసేందుకు వచ్చిన పనిమనిషికి ఇంటి మెట్ల కింద దుప్పటిలో శవం కనిపించింది. విషయం ఇంటి యజమాని రంగస్వామికి చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహంపై గాయాలు ఉండడం గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. రంగస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్రవంతిని తలపై బలమైన వస్తువుతో కొట్టడంతోపాటు మెడకు చున్నీతో ఉరిబిగించి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డులో స్రవంతి భర్త పాపారావు అని ఉండడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.