ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట రూ.1.20 కోట్ల మోసం
ABN , First Publish Date - 2021-03-27T12:04:35+05:30 IST
ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను
హైదరాబాద్ : ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన రాహుల్ సిరస్వాల్(29) డ్రైవర్గా పనిచేసేవాడు. అదే ప్రాంతానికి చెందిన వెల్డర్ మహే్షదేవ్(25)తో కలిసి ఆన్లైన్ షేర్ ట్రేడింగ్ పేరిట మోసాలకు తెరతీశారు. దీనికోసం పలు బ్యాంకుల్లో వివిధ పేర్లతో ఖాతాలు తెరిచారు. ఆన్లైన్లో ట్రేడింగ్ పేరుతో సోషల్మీడియాలో ప్రకటనలు ఇచ్చేవారు. ఆసక్తి గలవారు సంప్రదిస్తే వారి నుంచి అందినంత కాజేస్తున్నారు. నగరానికి చెందిన ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్టింగ్ చూసి వారిని సంప్రదించింది. ఆన్లైన్ షేర్ ట్రేడింగ్లో అధిక లాభాలు వస్తాయని ఆమెను నమ్మించారు.
ఆ మహిళ గత ఏడాది నవంబర్ 20న రూ. 5 లక్షలు వారు సూచించిన బ్యాంక్ ఖాతాలో జమచేసింది. కొద్ది రోజుల్లోనే రూ. 80 లక్షలు లాభం వచ్చిందని వారు ఫోన్లో ఆమెకు చెప్పారు. ఈ నగదు తీసుకోవాలంటే సంస్థ నిబంధనల ప్రకారం కొంత మొత్తం చెల్లించాలన్నారు. ఆమె నుంచి పలు దఫాలుగా రూ. 1.20 కోట్లు కాజేశా రు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. సీసీఎస్ బృందం మధ్యప్రదేశ్ ఇండోర్ వెళ్లి నిందితులను అరెస్టు చేసి నగరానికి తరలించారు.