కోడలు ఉరేసుకుంటుంటే అత్తమామల వీడియో షూట్.. సోషల్ మీడియాలో వైరల్
ABN , First Publish Date - 2021-04-14T01:53:22+05:30 IST
కోడలు ఉరివేసుకుంటుంటే కిటికీలోంచి వీడియో తీసిన అత్తమామలు ఆ తర్వాత దానిని సోషల్ మీడియాలో పోస్టు
ముజఫర్నగర్: కోడలు ఉరివేసుకుంటుంటే కిటికీలోంచి వీడియో తీసిన అత్తమామలు ఆ తర్వాత దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో వైరల్ అయితే కోడలు ఉరేసుకోవడంలో తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము అమాయకులమని తేలుతామన్నది వారి ఉద్దేశం. కానీ, వారి ఆశలు అడియాసలయ్యాయి. పోలీసులు వారిని కటకటాల వెనక్కి పంపారు. ఆమె భర్త, మరిది పరారీలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో జరిగిందీ ఘటన.
25 ఏళ్ల బాధితురాలు కోమల్ ముజఫర్నగర్లోని డాటియానా గ్రామంలో భర్త ఆశిష్, అత్తమామలతో కలిసి ఉంటోంది. అత్తమామల వేధింపులు భరించలేక మనస్తాపంతో గదిలోకి వెళ్లి ఉరేసుకుంది. సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ వీడియో ప్రకారం.. ఉరి వేసుకునేందుకు దుపట్టా కట్టిన కోమల్ అది గట్టగా ఉన్నదీ, లేనిదీ లాగి చూస్తోంది. ఓ వ్యక్తి (బహుశా ఆమె మామ) ‘ఆమెకు ఆమే ఉరివేసుకుంటోంది’ అని అరవడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.
తాము ఆమెను ఆపాలని ప్రయత్నించామని అత్తమామలు చెబుతున్నారని, కానీ వారి వేధింపులు భరించలేకే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని కోమల్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారని ఎస్పీ అర్పిత్ విజయ్వర్గీయ తెలిపారు. 2019లో వారికి వివాహం జరిగిందని, అప్పటి నుంచి ఆమెను కట్నం కోసం వేధిస్తున్నారని కోమల్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వివాహ సమయంలో రూ. 5 లక్షల కట్నం, బైక్ ఇచ్చానని, అయినప్పటికీ ఆశిష్ తల్లిదండ్రులు దేవేంద్ర, సవిత, ఆశిష్ సోదరుడు సచిన్ సంతోషంగా లేరని బాధితురాలి తండ్రి అనిల్ కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరు నెలల క్రితం కూడా ఆమెను కొట్టి బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, గ్రామ పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఆమెను తిరిగి ఇంట్లోకి రానిచ్చారని పేర్కొన్నారు.
రెండు నెలల క్రితం కూడా కోమల్ అత్తమామలు ఆమెను బెదిరించారని, రూ. 1.2 లక్షలు తీసుకురాకుంటే కుమారుడికి మరో పెళ్లి చేస్తామని హెచ్చరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.