అనుమానంతో భార్యను అతి కిరాతకంగా నరికేశాడు!
ABN , First Publish Date - 2021-05-03T13:24:48+05:30 IST
భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి కత్తితో అతి కిరాతకంగా నరికి హత్య
- నోట్లో గుడ్డలుకుక్కి.. కాళ్లు కట్టేసి.. కత్తితో నరికి చంపిన వైనం
- బంట్వారం మండలం మద్వాపూర్లో ఘటన
- పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
హైదరాబాద్/బంట్వారం : భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి కత్తితో అతి కిరాతకంగా నరికి హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా బంట్వారం పోలీస్స్టేషన్ పరిధిలోని మద్వాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మద్వాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు, లక్ష్మి(40)లకు 23 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరు రోజు వారీ కూలి కోసం తాండూరులో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. మూడు సంవత్సరాల నుంచి ఆంజనేయులు భార్య ఆమె తల్లి వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆంజనేయులు కొన్ని రోజుల క్రితం గ్రామంలో పంచాయితీ పెట్టి ఒప్పించి ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు. మళ్లీ ఆమె తన తల్లి ఇంటికి వెళ్లగా శనివారం మద్వాపూర్కు వెళ్లి ఇంటికి తీసుకువచ్చాడు. అదే రాత్రి 12గంటల సమయంలో లక్ష్మి(40) నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కాళ్లు కట్టివేసి కత్తితో మెడ, చేతులపై పొడిచి హత్యచేశాడు.
ఇంట్లో నుంచి అరుపులు రావడంతో చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అక్కడి నుంచి ఆంజనేయులు నేరుగా ఉదయం 4గంటలకు పోలీస్స్టేషన్కు వచ్చి భార్యను హత్య చేసినట్లు ఒప్పుకుని లొంగిపోయాడు. భార్యపై అనుమానంతో ఈ హత్య చేసినట్లు ఆయన వివరించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ధారూరు సీఐ తిరుపతిరాజు, బంట్వారం ఎస్ఐ ప్రవీణ్రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని మర్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.