దారిదోపిడీకి పాల్పడిన గ్యాంగ్ అరెస్ట్
ABN , First Publish Date - 2021-03-05T12:14:31+05:30 IST
దారికాచి దోచుకుంటూ సెల్ఫోన్లు తస్కరిస్తున్న ముగ్గురు సభ్యుల గ్యాంగ్ను
హైదరాబాద్ సిటీ : దారికాచి దోచుకుంటూ సెల్ఫోన్లు తస్కరిస్తున్న ముగ్గురు సభ్యుల గ్యాంగ్ను అంబర్పేట్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 1న అంబర్పేట్ దుర్గానగర్లో ఓ వ్యక్తిని బెదిరించి.. తీవ్రంగా కొట్టడమే కాకుండా అతడి నుంచి సెల్ఫోన్, రూ.510 నగదును తస్కరించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ముజాహిద్(21), అమీర్పేట్ నివాసి మహమ్మద్ సమీర్(22), అంబర్పేట్ వాసి మహమ్మద్ నవాజ్(19)లు కలిసి ఓ గ్యాంగ్గా ఏర్పడ్డారు. చిన్నతనంలోనే చెడు అలవాట్లకు బానిసైన యువకులు సంపాదన సరిపడక నేరాల బాట పట్టారు.
ఒంటరిగా వెళ్లే వారిని అడ్డుకుని బెదిరించి వారి నుంచి ఫోన్లు, డబ్బు దోచుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 1న రాత్రి 8గంటల సమయంలో శ్రవణ్ అనే వ్యక్తి అంబర్పేట్ దుర్గానగర్ వద్ద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ ముగ్గురూ కలిసి అతన్ని అడ్డుకుని డబ్బు, ఫోన్ డిమాండ్ చేశారు. నిరాకరించడంతో అతన్ని తీవ్రంగా కొట్టారు. ఫోన్, రూ.510 నగదుతో పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. వారి నుంచి తస్కరించిన ఫోన్, డబ్బును స్వాధీనం చేసుకున్నారు.