కాలేజీకి వెళ్లేటప్పుడు పోకిరీల వేధింపులు.. ధైర్యం చేసి 7 సెకండ్ల వీడియో తీసిన విద్యార్థిని.. ఎమ్మెల్యేకు చేరడంతో..
ABN , First Publish Date - 2021-10-29T06:50:01+05:30 IST
కాలేజికి వెళ్లే దారిలో ఇబ్బంది పెడుతున్న యువకుల వీడియో తీసిన యువతులు వాట్సాప్లో షేర్ చేయడంతో వారి సమస్య శాశ్వతంగా..
రాయ్పూర్: కాలేజికి వెళ్లే దారిలో ఇబ్బంది పెడుతున్న యువకుల వీడియో తీసిన యువతులు వాట్సాప్లో షేర్ చేయడంతో వారి సమస్య శాశ్వతంగా తీరినట్లైంది. రోజూ కాలేజికి వెళ్లే సమయంలో ఇబ్బంది పెడుతుండడంతో.. గురువారం ఓ యువతి వారిని వీడియో తీసి తన మొబైల్లో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో స్థానిక ఎమ్మెల్యే మొబైల్కు చేరడంతో ఆయన హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే, అప్పుడు అబ్బాయిలు పారిపోయారు. అయినప్పటికీ ఎమ్మెల్యే స్థానిక పోలీసులకు ఫోన్ చేసి.. నిందితులను వెంటనే పట్టుకోవాలని స్టేషన్ ఇన్చార్జికి సూచించారు.
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్గఢ్లోని గౌరెలా-పెండ్రా-మార్వాహి(జిపిఎం) జిల్లాలో మార్వాహి క్షేత్రం బగరార్ గ్రామంలోని హయ్యర్ సెకండరీ పాఠశాల ఉంది. ఈ పాఠశాలకు వచ్చే దారిలో పోకిరీల బెడదతో అమ్మాయిలు చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. గురువారం కూడా ముగ్గురు అబ్బాయిలు అటుగా వస్తున్న విద్యార్థినులను వేధించసాగారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న అమ్మాయిలు.. కొద్ది దూరం నుంచి వారిని వీడియో తీసి వాట్సాప్లో షేర్ చేశారు. సాయం చేయాలని కోరారు. 7 సెకన్ల వీడియో ఎమ్మెల్యే కేకే ధ్రువ్ మొబైల్కు చేరింది. ఆ సమయంలో ఆయన తన విశ్రాంతి గృహంలో స్థానిక నాయకులతో సమావేశంలో ఉన్నారు.
అయినప్పటికీ వీడియో చూడగానే జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్రాయ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి వీరేంద్ర సింగ్ బఘెల్తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే ముగ్గురు పోకిరీలు పారిపోయారు. దీనిపై స్టేషన్ ఇన్చార్జి నరేంద్రసింగ్కు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాల సమయంలో పోలీసుల గస్తీ కోసం ఎస్పీతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
