చాటింగ్ చేస్తున్నారని ఇద్దరు అక్కచెల్లెళ్లపై కర్రలు, రాళ్లతో దాడి
ABN , First Publish Date - 2021-07-04T22:26:03+05:30 IST
ఫోన్లో తమ మేనమామ కుమారులతో చాటింగ్ చేస్తున్నారని ఇద్దరు అక్కచెల్లెళ్లలను సొంత కుటుంబ సభ్యులు కర్రలతో దారుణంగా
భోపాల్: ఫోన్లో తమ మేనమామ కుమారులతో చాటింగ్ చేస్తున్నారని ఇద్దరు అక్కచెల్లెళ్లలను సొంత కుటుంబ సభ్యులు కర్రలతో దారుణంగా చావబాదారు. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో జరిగిందీ ఘటన. వారిపై దాడి చేసి చితకబాదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
మహిళలు, పురుషులు కలిసి అమ్మాయిల జట్టు పట్టుకుని రాళ్లు, కర్రలతో దాడి చేస్తుండగా, తమను క్షమించాలని వారు వేడుకోవడం వీడియోలో కనిపిస్తోంది. గత నెల 22న పీపల్వా గ్రామంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. బాధితుల వయసు 19, 20 సంవత్సరాలు. బాధిత యువతులు తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడ్డారు. తర్వాత ఓ యువతిని పోలీస్ స్టేషన్కు రప్పించి వాంగ్మూలం నమోదు చేశారు.
గ్రామంలోని ఓ స్కూలు వద్ద తమను అడ్డుకున్న బాబాయి కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు దాడికి పాల్పడినట్టు వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. యువతులిద్దరినీ వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇదే రాష్ట్రంలోని అలీరాజ్పూర్ జిల్లాలో ఇటీవల ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. అత్తారింటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన ఓ మహిళను చెట్టుకు కట్టేసి తల్లిదండ్రులు, సోదరులు దాడిచేశారు.