బంగారానికి దేశవ్యాప్తంగా ఒకే ధర!
ABN , First Publish Date - 2021-09-29T06:05:28+05:30 IST
ప్రస్తుతం పసిడి ధరలు నగరాన్ని బట్టి మారుతుంటాయి. ఒకేరోజున
- గోల్డ్ ఎక్స్ఛేంజీల ఏర్పాటుకు సెబీ బోర్డు ఓకే..
- ఎలకా్ట్రనిక్ గోల్డ్ రిసీట్స్ రూపంలో ట్రేడింగ్
ముంబై: ప్రస్తుతం పసిడి ధరలు నగరాన్ని బట్టి మారుతుంటాయి. ఒకేరోజున ఓ నగరంలో ఎక్కువ.. మరో నగరంలో తక్కువగా ఉండొచ్చు. ఈ లోహం ధరతో పాటు స్వచ్ఛతలోనూ పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా బంగారం ఒకే ధర పలికేందుకు వీలుగా గోల్డ్ ఎక్స్ఛేంజీలను ఏర్పాటు చేయనున్నట్లు ఈసారి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ ప్రకటించారు. గోల్డ్ స్పాట్ ట్రేడింగ్ కార్యకలాపాలను సైతం క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి ‘సెబీ’నే పర్యవేక్షిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. తదనుగుణంగా వీటి ఏర్పాటుకు ప్రతిపాదించిన విధివిధానాలకు సెబీ బోర్డు మంగళవారం ఆమోదం తెలిపింది.
బోర్డు సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెబీ చైర్మన్ అజయ్ త్యాగి ఈ విషయాన్ని వెల్లడించారు. ఎలకా్ట్రనిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్) ద్వారా బంగారం స్పాట్ ట్రేడింగ్ జరుగుతుందని, సెక్యూరిటీ కాంట్రాక్టుల (నియంత్రణ) చట్టం 1956 ప్రకారంగా ఈజీఆర్లను సైతం సెక్యూరిటీలుగా పరిగణించడం జరుగుతుందని త్యాగి స్పష్టం చేశారు. అంటే, ఇతర సెక్యూరిటీ తరహాలోనే ఈజీఆర్లలోనూ ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్ జరుగుతుంది. మరిన్ని విషయాలు..
ప్రస్తుతం దేశంలో గోల్డ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్కు మాత్రమే అనుమతి ఉంది. సెబీ బోర్డు ఆమోదంతో చైనా తదితర దేశాల తరహాలో ఇకపై మన మార్కెట్లోనూ గోల్డ్ స్పాట్ ట్రేడింగ్ అందుబాటులోకి రానుంది.
ప్రస్తుత లేదా కొత్తగా గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలు ప్రత్యేక సెగ్మెంట్గా ఈజీఆర్ ట్రేడింగ్ను ప్రారంభించవచ్చు. ఈజీఆర్ యూనిట్ డినామినేషన్ (1 గ్రాము, 2 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాములు, 100 గ్రాములు). ట్రేడర్లకు ఈజీఆర్ యూనిట్లను బంగారం లోహం రూపంలో డెలివరీ వంటి అంశాలను సెబీ ముందస్తు అనుమతితో ఎక్స్ఛేంజీలు నిర్ణయిస్తాయి.
ఎక్స్ఛేంజీలో క్రయ, విక్రయాలను క్లియరింగ్ కార్పొరేషన్లు పరిష్కరిస్తాయి. అంటే, కొనుగోలుదారులకు ఈజీఆర్లను, విక్రయదారులకు నిధులను బదిలీ చేస్తాయి.
ఈజీఆర్ల చెల్లుబాటుకు కాలపరిమితంటూ ఏమి లేదు. కాబట్టి, కొనుగోలుదారు ఈ యూనిట్లను తనకు ఇష్టం వచ్చినంత కాలం తనవద్ద అట్టిపెట్టుకోవచ్చు. ఈజీఆర్లను సరెండర్ చేయడం ద్వారా ఆ యూనిట్లకు సమానమైన బంగారాన్ని వాల్ట్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు.
ఏదేని కార్పొరేట్ సంస్థలు వాల్ట్ మేనేజర్లుగా వ్యవహరించవచ్చు. అయితే, ఈ వాల్ట్ మేనేజర్లు తప్పక సెబీ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు కనీసం రూ.50 కోట్ల నెట్వర్త్ కలిగి ఉండాలి. వాల్ట్ మేనేజర్లు బంగారం నిల్వల సేకరణ, భద్రపర్చడంతోపాటు ఈజీఆర్ల ఏర్పాటు, ఉపసంహరణ, కస్టమర్ల ఇబ్బందుల పరిష్కారం వంటి సేవలందిస్తాయి.
నిబంధనలు ఉల్లంఘిస్తే ‘జీ’పై చర్యలు
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు రుజువైతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సెబీ చైర్మన్ త్యాగి అన్నారు. అయితే, మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఇచ్చేందుకు మాత్రం నిరాకరించారు.
సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజీల ఏర్పాటుకూ ఆమోదం
సామాజిక సంస్థలు నిధులు సమీకరించేందుకు వీలుగా సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎ్సఎ్సఈ)ల ఏర్పాటుకు సైతం సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. ఎస్ఎ్సఈలు ప్రస్తుత స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ప్రత్యేక సెగ్మెంట్గా ఉంటాయని అజయ్ త్యాగి తెలిపారు. ఇప్పటికే సెబీ ఆమోదిత.. 15 సామాజిక కార్యకలాపాలు సాగిస్తున్న లాభపేక్ష లేని సంస్థలు (ఎన్పీఓ), లాభాలు ఆశించే సామాజిక సంస్థలు.. ఎస్ఎ్సఈ సెగ్మెంట్ ద్వారా నిధులు సమీకరించేందుకు వీలుంటుంది. ఈక్విటీ, జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ బాండ్లు, మ్యూచువల్ ఫండ్లు, సోషల్ ఇంపాక్ట్ ఫండ్లు, డెవల్పమెంట్ ఇంపాక్ట్ ఫండ్ల ద్వారా ఈ సంస్థలు నిధులు సమీకరించవచ్చని సెబీ స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘బడ్జెట్ 2019-20’లో ఎస్ఎ్సఈల ఏర్పాటు ఆలోచనను ప్రకటించారు.
త్వరలో సిల్వర్ ఈటీఎ్ఫలు
గోల్డ్ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎఫ్) తరహాలో సిల్వర్ ఈటీఎఫ్లను ప్రవేశపెట్టేందుకు సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. అంతేకాదు, సిల్వర్ ఈటీఎ్ఫలు ప్రవేశపెట్టేందుకు అనుగుణంగా మ్యూచువల్ ఫండ్ల నిబంధనల్లో మార్పులనూ ఆమోదించింది.
మరిన్ని నిర్ణయాలు
నవతరం టెక్నాలజీ కంపెనీలను ప్రోత్సహించేందుకు సుపీరియర్ ఓటింగ్ రైట్స్ (ఎస్ఆర్) షేర్ల జారీకి సంబంధించిన నియమావళిని సెబీ సడలించింది. రూ.1,000 కోట్లకు మించని నెట్వర్త్ కలిగిన ప్రమోటర్లు తమ కంపెనీలో సుపీరియర్ ఓటింగ్ రైట్స్ను కలిగి ఉండవచ్చు. ప్రస్తుత పరిమితి రూ.500 కోట్లే. అలాగే, ఎస్ఆర్ షేర్ల జారీకి, ఐపీఓకు వచ్చేందుకు డీఆర్హెచ్పీ సమర్పించేందుకు మధ్య కనీస గడువును 6 నెలల నుంచి 3 నెలలకు తగ్గించింది.
విలీన, కొనుగోలు ఒప్పందాలను మరింత సహేతుకంగా, సులభంగా మార్చేందుకు వీలుగా ఓపెన్ ఆఫర్ తర్వాత కంపెనీ ఈక్విటీ షేర్లను స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ చేసేందుకు నిబంధనలను సవరించాలని సెబీ నిర్ణయించింది.
రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్లపై పర్యవేక్షణ, నిబంధనల అమలును మరింత పటిష్ఠపరిచేందుకు సమూల మార్పులు చేపట్టాలని సెబీ నిర్ణయించింది. అంతేకాదు, రిలేటెడ్ పార్టీ అండ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ నిర్వచనాన్ని సడలించాలని నిర్ణయించింది.
సెక్యూరిటీస్ మార్కెట్ కోసం రూపొందించిన ఇన్వెస్టర్స్ చార్టర్కు సైతం సెబీ బోర్డు ఆమోదం తెలిపింది.