ఈ నెల 29 న హైదరాబాద్ లో ప్రారంభం కానున్న ప్రీమియర్ ఎనర్జీస్ ప్లాంట్
ABN , First Publish Date - 2021-07-28T21:24:48+05:30 IST
తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. రూ. 1,200 కోట్లుతో ఓయూనిట్ ఏర్పాటుకు ప్రీమియర్ ఎనర్జీస్ అంగీకరించింది.
హైదరాబాద్ : తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. రూ. 1,200 కోట్లుతో ఓయూనిట్ ఏర్పాటుకు ప్రీమియర్ ఎనర్జీస్ అంగీకరించింది. సౌర విద్యుదుత్పత్తి పరికరాల తయారీ కంపెనీ ‘ప్రీమియర్ ఎనర్జీస్’... హైదరాబాద్లో నెలకొల్పిన కొత్త ప్లాంటును ఈ నెల 29 న ప్రారంభించనుంది. రూ. 483 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ను గురువారం కేటీఆర్ ప్రారంభించనున్నారు.
దీనితోపాటు విస్తరణ ప్రాజెక్టు కూడా హైదరాబాద్ లోనే ఉండనుందని, ఇందుకుగాను మరో రూ. 1,200 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్టు సంస్థ వెల్లడించింది. త్వరలో ప్రారంభం కానున్న ఈ యూనిట్ 750 మెగావాట్ల సోలార్ సెల్స్, 750 మెగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్లాంటులో ఎంసీసీఈ టెక్చర్డ్ మల్టీ-క్రిస్టల్లీన్ సెల్స్, మాడ్యూల్స్, మోనో పీఈఆర్సీ సెల్స్, మాడ్యూల్స్, పాలీక్రిస్టల్లీన్ సెల్స్, మాడ్యూల్స్ ఉత్పత్తి కానున్నాయి. రూ. 1,200 కోట్ల పెట్టుబడులతో వచ్చే రెండేళ్ళలో ఉత్పాదక సామర్థ్యాన్ని 3 గిగావాట్లకు విస్తరించనున్నట్లు సంస్థ తెలిపింది. వచ్చే నాలుగు నెలల్లోనే రూ. 500 కోట్ల పెట్టుబడితో ఒక గిగావాట్ సామర్థ్యాన్ని పెంచుతామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రూ. 500 కోట్లు పెట్టుబడి పెడుతామని తెలిపింది. మొత్తంమీద వచ్చే రెండేండ్లలో రూ. 1,000-1,200 కోట్ల వరకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టనుంది.