రూ.1,884 కోట్ల మోసం
ABN , First Publish Date - 2021-08-20T06:07:40+05:30 IST
బ్యాంకులతో పాటు తన క్లయింట్లను మోసం చేశారనే ఆరోపణలపై కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎ్సబీఎల్) చైర్మన్ సి పార్థసారథి (67)ని సీసీఎస్, డిటెక్టివ్ డిపార్ట్మెంట్ (డీడీ) పోలీసులు అరెస్టు చేశారు.
![రూ.1,884 కోట్ల మోసం](https://media.andhrajyothy.com/appimg/galleries/1921082012242435/08202021003723n43.jpg)
- కార్వీ స్టాక్ బ్రోకింగ్ చైర్మన్ పార్థసారథి అరెస్టు
- కూపీ లాగుతున్న సీసీఎస్ పోలీసులు
హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): బ్యాంకులతో పాటు తన క్లయింట్లను మోసం చేశారనే ఆరోపణలపై కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎ్సబీఎల్) చైర్మన్ సి పార్థసారథి (67)ని సీసీఎస్, డిటెక్టివ్ డిపార్ట్మెంట్ (డీడీ) పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల కార్వీ సంస్థపై ఇండస్ ఇండ్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన డిటెక్టివ్ విభాగం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇండస్ ఇండ్ బ్యాంక్లో సెక్యూరీటీలు, షేర్లు తనఖా పెట్టడంతో పాటు వ్యక్తిగత పూచీకత్తుపై బ్యాంకు నుంచి పార్థసారథి రూ.137 కోట్ల రుణం పొందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ రుణాలను తన సొంత అవసరాల కోసం ఇతర బ్యాంక్ ఖాతాలకు మళించినట్లు తెలిపింది. మార్చి 31తో ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరానికి కార్వీ సంస్థ.. రుణాలు చెల్లించడంలో విఫలమైనందున చర్యలు తీసుకోవాలని ఇండస్ ఇండ్ తన ఫిర్యాదులో పేర్కొంది, తనఖా పెట్టిన సెక్యూరిటీ బాండ్లు, షేర్లు కూడా ఆయా ఖాతాదారులకు తెలియకుండానే అధికార దుర్వినియోగానికి పాల్పడి.. వాటిని మోసపూరితంగా బ్యాంక్కు సమర్పించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆయా ఖాతాదారులు కార్వీలో ఉన్న తమ డ్యీమాట్ అకౌంట్లకు బదిలీ చేసిన సెక్యూరిటీలను తనఖా పెట్టి మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. రెండేళ్ల నుంచి సాగుతున్న ఈ మోసాన్ని 2019 నవంబరు 22 న మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గు ర్తించి కార్వీపై సెబీ నిషేధం విధించింది.
వెలుగులోకి మరిన్ని: దర్యాప్తు కొనసాగించిన అధికారులకు కార్వీ చైర్మన్, ఎండీ చేసిన ఇతర మోసాలు కూడా వెలుగులోకి వచ్చాయి. డీమ్యాట్ ఖాతా లు కలిగిన ఖాతాదారులకు సంబంధించిన ఖాతాల్లో ఉన్న రూ.720 కోట్లను కూడా మళ్లించినట్లు గుర్తించారు. అంతేకాకుండా పలు బ్యాంకుల నుంచి క్రెడిట్ సౌకర్యం పొందిన పార్థసారథి సెక్యూరిటీలు తనఖా పెట్టి మరో రూ.680 కోట్ల వరకు రుణం పొందినట్లు గుర్తించారు. సెబీ నిషేధం విధించిన తర్వాత కార్వీపై పలు ఫిర్యాదులు అందడంతో ఆయా కేసుల్లోనూ సీసీఎ్సలో దర్యాప్తు కొనసాగుతోంది. కాగా కేఎ్సబీఎల్ చైర్మన్ మోసపూరితంగా రుణాలు పొందినట్లు హెచ్డీఎ్ఫసీ బ్యాంక్ కూడా కేసు నమోదు చేసింది. ఇలా రుణాలు పొంది మోసం చేసిన రెండు కేసుల్లో రూ.347 కోట్లు కాజేసినట్లు సీసీఎస్ అధికారులు గుర్తించా రు. ప్రస్తుతం కేసులన్నీ విచారణలో ఉన్నాయని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మహంతి తెలిపారు. ఆయా కేసుల విచారణతో పాటు తాజా కేసుల్లో నిందితునిగా ఉన్న పార్థసారథిని జూబ్లీహిల్స్లో అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు రిమాండ్కు తరలించారు.