నవంబరు 10... రిలయన్స్ రికార్డ్ డేట్
ABN , First Publish Date - 2021-10-30T04:57:29+05:30 IST
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) ఫైనల్ కాల్ వచ్చింది, రికార్డ్ డేట్ తెచ్చింది.
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) ఫైనల్ కాల్ వచ్చింది, రికార్డ్ డేట్ తెచ్చింది. పార్షియల్లీ పెయిడ్ ఈక్విటీ షేర్ల రెండో లేదా చివరి మొత్తాన్ని షేర్హోల్డర్లు చెల్లించేందుకు, నవంబరు 10 ని రికార్డ్ డేట్గా ప్రకటించింది. పాక్షిక చెల్లింపు షేర్లను కలిగినవారంతా నవంబరు 15-29 తేదీల మధ్య ఒక్కో షేరుకు రూ. 628.50 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పూర్తి చెల్లింపులు పూర్తయి, ఆ షేర్లన్నీ సాధారణ షేర్లుగా మారతాయి. రూ. 5 ఫేస్ వాల్యూ ఉన్న పాక్షిక చెల్లింపుల ఈక్విటీ షేర్ల ట్రేడింగ్ నవంబరు 9 నుంచి నిలిపివేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
రూ. 2.50 ఫేస్ వాల్యూ ఉన్న పాక్షిక చెల్లింపుల షేర్లకు రూ. 314.25 చొప్పున చెల్లింపుల కోసం ఫస్ట్ కాల్ ఇచ్చిన కంపెనీ, మే 11 న వాటి ట్రేడింగ్ నిలిపేసింది. మే 17-31 మధ్య కాలంలో ఆ డబ్బులు వసూలు చేసింది. ఫస్ట్ కాల్లో రూ. 13,151 కోట్లు వచ్చాయి. ఇది, ఫస్ట్ కాల్లో రావల్సిన మొత్తంలో దాదాపు 99 శాతం. కాగా... నిరుడు జూన్లో రూ. 53,124 కోట్ల విలువైన రైట్స్ ఇష్యూలో భాగంగా, 422.6 మిలియన్ పాక్షిక చెల్లింపుల షేర్లను ఆర్ఐఎల్ జారీ చేసింది.
గురువారం ఆర్ఐఎల్ షేర్లు 1.4 % నీరసించి రూ. 2,599.35 వద్ద ముగియగా, కంపెనీ పాక్షిక చెల్లింపు షేర్లు రూ. 1,957.50 వద్ద ముగిసాయి. ఈ రోజు కూడా కరెక్షన్లో ఉన్న ఆర్ఐఎల్ షేర్లు, ఉదయం 10.31 గంటల సమయానికి రూ. 2,580 స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి.