మారుతికి చిప్ సెగ
ABN , First Publish Date - 2021-10-28T08:10:26+05:30 IST
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) లాభాలకు చిప్ల కొరత బ్రేక్ వేసింది.

8 66% తగ్గిన క్యూ2 లాభం
న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) లాభాలకు చిప్ల కొరత బ్రేక్ వేసింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ నికర లాభం ఏకంగా 66 శాతం తగ్గి రూ.487 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో మారుతి లాభం రూ.1,420 కోట్లుగా ఉంది. కమోడిటీ ధరల పెరుగుదలతో పాటు సెమీ కండక్టర్ (చిప్) కొరత పనితీరును గణనీయంగా దెబ్బతీసిందని పేర్కొంది. కాగా త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం మాత్రం రూ.18,756 కోట్ల నుంచి రూ.20,551 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో వాహన విక్రయాలు 3 శాతం తగ్గి 3,79,541 యూనిట్లకే పరిమితమయ్యాయి. కాగా ఎలక్ర్టానిక్ చిప్ల కొరత వల్ల 1.16 లక్షల కార్లను ఉత్పత్తి చేయలేకపోయినట్టు కంపెనీ ప్రకటించింది. అలాగే 2 లక్షల కస్టమర్ ఆర్డర్లు పెండింగులో ఉన్నట్టు తెలిపింది. కాగా 2025 తర్వాతనే కంపెనీ విద్యుత్ కారు విడుదల చేయగలుగుతుందని ఎంఎస్ఐ చైర్మన్ తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో ఈవీలకు డిమాండు తక్కువగా ఉన్నదంటూ తాము విద్యుత్ వాహనాల రంగంలోకి ప్రవేశించిన తర్వాత నెలకు 10 వేల యూనిట్లు విక్రయించగలమని భావిస్తున్నట్లు భార్గవ చెప్పారు.