మళ్లీ రూ.55,000కు బంగారం

ABN , First Publish Date - 2021-12-31T09:09:46+05:30 IST

కొత్త ఏడాదిలో బంగారం ధరలు మళ్లీ ఎగబాకవచ్చని, 2022 చివరినాటికి తులం మేలిమి బంగారం రూ.55,000 దాటొచ్చని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మళ్లీ రూ.55,000కు బంగారం

కొత్త ఏడాదిలో బంగారం ధరలు మళ్లీ ఎగబాకవచ్చని, 2022 చివరినాటికి తులం మేలిమి బంగారం రూ.55,000 దాటొచ్చని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కరోనా కష్టాలు, ప్రపంచవ్యాప్తంగా ధరలు ఆందోళనకర స్థాయికి పెరగడం, డాలర్‌ బలపడుతుండటం వంటి అంశాలు విలువైన లోహాల ధరల పెరుగుదలకు కారణం కానున్నాయని వారన్నారు. 2022 ప్రథమార్ధంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ రేటు 1,700-1,900 డాలర్ల స్థాయిలో ట్రేడ్‌ కానుందని, ద్వితీయార్ధంలో 2,000 డాలర్ల స్థాయిని దాటవచ్చని కామ్‌ట్రెండ్జ్‌ సహ వ్యవస్థాపకులు, సీఈఓ జ్ఞానశేఖర్‌ త్యాగరాజన్‌ అంచనా వేశారు. భారత్‌లోని మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ (ఎంసీఎక్స్‌)లో తులం బంగారం ఽవచ్చే ఏడాది ప్రథమార్ధంలో రూ.45,000-50,000 స్థాయిలో, ద్వితీయార్ధంలో రూ.55,000 స్థాయికి చేరుకోవచ్చన్నారు.


కరోనా సంక్షోభ తీవ్రత కారణంగా 2020లో బంగారం ధరలు వేగంగా పరుగు తీశాయి. 2020 ఆగస్టులో తులం బంగారం రూ.56,200 వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత కాలంలో మళ్లీ తగ్గుముఖం పట్టిన ధర ప్రస్తుతం రూ.48,000 స్థాయిలో కదలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ 1,800 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆల్‌టైం గరిష్ఠ స్థాయితో పోలిస్తే ఽగోల్డ్‌  రేటు దాదాపు 14 శాతం తగ్గింది. ఈ ఏడాది జనవరి నాటి స్థాయితో పోల్చినా 4 శాతం తక్కువే. విలువైన లోహాల్లోని పెట్టుబడులను ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లకు మళ్లించడం ఇందుకు కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు. 

Updated Date - 2021-12-31T09:09:46+05:30 IST