ఉద్దీపనల ఉత్సాహం

ABN , First Publish Date - 2021-01-20T08:30:15+05:30 IST

కరోనా సంక్షోభం నుంచి ఊరట కల్పించేందుకు అమెరికా తదితర అగ్రరాజ్యాలు మరిన్ని ఉద్దీపనలు ప్రకటించవచ్చన్న అంచనాలతో దలాల్‌ స్ట్రీట్‌ వర్గాల్లో ఉత్సాహం ఉరకలేసింది.

ఉద్దీపనల ఉత్సాహం

834 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌.. 14,500 ఎగువకు నిఫ్టీ 

నాలుగు నెలల్లో సూచీలకిదే అతిపెద్ద లాభం

 మార్కెట్‌ సంపద రూ.3.41 లక్షల కోట్లు అప్‌ 


ముంబై: కరోనా సంక్షోభం నుంచి ఊరట కల్పించేందుకు అమెరికా తదితర అగ్రరాజ్యాలు మరిన్ని ఉద్దీపనలు ప్రకటించవచ్చన్న అంచనాలతో దలాల్‌ స్ట్రీట్‌ వర్గాల్లో ఉత్సాహం ఉరకలేసింది. రూపాయి బలపడటం, విదేశీ పెట్టుబడుల జోరు కూడా తోడవడంతో స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు రివ్వున ఎగిశాయి. దీంతో మంగళవారం నాడు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 834.02 పాయింట్లు లాభంతో 49,398.29 దగ్గర క్లోజైంది. మరోవైపు ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 239.85 పాయింట్ల లాభంతో 14,521.15 వద్ద ముగిసింది. దాదాపు నాలుగు నెలల్లో సూచీలకిదే అతిపెద్ద ఒక్కరోజు లాభం. ప్రధాన షేర్లతో పాటు చిన్న, మధ్య స్థాయి కంపెనీల్లోనూ కొనుగోళ్ల జోరు కన్పించింది. దాంతో బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్‌ సూచీ 1.66 శాతం, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 2.31 శాతం పుంజుకున్నాయి. బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.3.41 లక్షల కోట్లు పెరిగి రూ.196.19 లక్షల కోట్లకు చేరుకుంది. 


30లో 27 లాభాల్లో.. 

సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 27 లాభాల్లో ముగియగా.. మిగతా 3 నష్టపోయాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 6.80 శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బజాజ్‌ ఫైనాన్స్‌  సైతం 5.25 శాతం పుంజుకుంది. హెచ్‌డీఎ్‌ఫసీ 3.45 శాతం ఎగబాకింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, సన్‌ఫార్మా, బజాజ్‌ ఆటో, ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 2 శాతం పైగా పెరిగాయి. పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, అలా్ట్రటెక్‌ సిమెంట్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, మారుతి సుజుకీ, టీసీఎస్‌ ఒక శాతం పైగా బలపడ్డాయి. రంగాలవారీగా చూస్తే, బీఎ్‌సఈ  రియల్టీ సూచీ అత్యధికంగా 4.04 శాతం లాభపడింది.


రేపటి నుంచి హెచ్‌ఎ్‌ఫఎ్‌ఫసీ ఐపీఓ

తాకట్టుపై రుణాలిచ్చే హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీ (హెచ్‌ఎ్‌ఫఎ్‌ఫసీ) తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ఈన ెల 21న ప్రారంభం కానుంది. ఇష్యూ ధర శ్రేణిని రూ.517-518గా నిర్ణయించింది. ఐపీఓ ద్వారా రూ.1,153 కోట్ల వరకు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాదిలో ఇది మూడో ఐపీఓ కానుంది. కాగా ఇండిగో పెయింట్స్‌ ఐపీఓ బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగియనుంది. ఇష్యూ ధర శ్రేణిని రూ.1,488-1,490గా నిర్ణయించింది. 


జీడీపీని మించిన మార్కెట్‌ సంపద!

స్టాక్‌ మార్కెట్‌ వర్గాల సంపద మన దేశ జీడీపీని మించిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) భారత జీడీపీ (ప్రస్తుత ధరల ఆధారంగా) రూ.194.8 లక్షల కోట్లకు పరిమితం కావచ్చని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) ఈ మధ్యనే తొలి ముందస్తు అంచనాలను విడుదల చేసింది. ప్రస్తుతం బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం క్యాపిటలైజేషన్‌ రూ.196 లక్షల కోట్ల పైమాటే. అంటే, ఈ ఆర్థిక సంవత్సరానికి నమోదు కానున్న జీడీపీతో పోలిస్తే మార్కె ట్‌ వర్గాల ప్రస్తుత సంపదే అధికమన్నమాట.

Updated Date - 2021-01-20T08:30:15+05:30 IST