అందరి చూపూ యూఎస్ ఫెడ్‌పైనే...

ABN , First Publish Date - 2021-10-31T21:56:10+05:30 IST

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన సమావేశ ఫలితాలు బుధవారం రాబోతున్నాయి. ఈ క్రమంలో... ప్రపంచ మార్కెట్లలో ఉత్కంఠ నెలకొంది.

అందరి చూపూ యూఎస్ ఫెడ్‌పైనే...

న్యూఢిల్లీ : యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన సమావేశ ఫలితాలు బుధవారం రాబోతున్నాయి. ఈ క్రమంలో... ప్రపంచ మార్కెట్లలో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌ఐఐలు జాగ్రత్త పడుతున్నారు. దీంతో, దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో వచ్చే వారం కూడా ఎలుగుల జోరు కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. నెలకు $120 బిలియన్ల బాండ్ల కొనుగోళ్ల కార్యక్రమానికి సంబంధించి టేపరింగ్‌ను అమెరికా సెంట్రల్ బ్యాంక్ ప్రకటించే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. వచ్చే నెలలోనే టేపరింగ్‌ ప్రారంభమయ్యే అవకాశముంది. వచ్చే ఏడాదిలో అధిక వడ్డీ రేట్ల అంచనాలతో గ్లోబల్ మనీ మార్కెట్లు ఇప్పటికే నగదు ప్రవాహాన్ని టైట్ చేయడం ప్రారంభించాయి.


కొన్ని మార్కెట్ల ప్రకారం, పది దేశాల సెంట్రల్ బ్యాంకుల గ్రూప్‌ నుంచి 2022 లో 500 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్ల పెంపును పెట్టుబడిదారులు అంచనా వేశారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, యూఎస్ ఫెడ్‌ దీనిని లీడ్‌ చేస్తాయని చెబుతున్నారు. బ్యాంకులు, ఐటీ సెక్టార్లలో విదేశీ సంస్థలకు భారీ భాగస్వామ్యముంది. దీంతో, వీటిలోనే ఎక్కువ అమ్మకాలు జరిగి ఆ సూచీలు నష్టపోయాయి. గత తొమ్మిది సెషన్లుగా సెంటిమెంట్ బేరిష్‌గా ఉన్నప్పటికీ, కొనుగోళ్ల కోసం ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా... ఖచ్చితమైన స్టాప్ లాస్‌తో ట్రేడ్‌ చేయాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. యూఎస్ ఫెడ్‌ను ఓ పక్కన పెడితే, సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలను కేడా  ఇన్వెస్టర్లు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. వచ్చే వారంలో పలు ప్రభుత్వరంగ సంస్థలు, ఫార్మా కంపెనీలు తమ నంబర్లను ప్రకటించనుండడంతో... ఈ రెండు రంగాలపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. 

Updated Date - 2021-10-31T21:56:10+05:30 IST