‘కార్పొరేట్’లో సంచలనం... అమెజాన్, ఫ్యూచర్లకు ఈడీ నోటీసులు...
ABN , First Publish Date - 2021-11-28T22:08:53+05:30 IST
అమెజాన్, ఫ్యూచర్ గ్రూపులకు ఎన్ఫర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ కావడం కార్పొరేట్ రంగంలో సంచలనం రేపింది.

హైదరాబాద్ : అమెజాన్, ఫ్యూచర్ గ్రూపులకు ఎన్ఫర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ కావడం కార్పొరేట్ రంగంలో సంచలనం రేపింది. ముందటేడు(2019) డీల్ లో ఫెమా నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దేశంలోని అతిపెద్ది రిటైల్ కంపెనీ ‘ఫ్యూచర్ గ్రూప్’తో ఏ క్షణాన ఒప్పందం చేసుకున్నారో కానీ... ఈ అంశం రోజుకో ములపు తిరుగుతుంది. ఇప్పటికే ఎన్సీఎల్టీ నుంచి సుప్రీంకోర్టు వరకు కేసులు నడుస్తున్నాయి. అంతర్జాతీయ ట్రైబ్యునల్ లోనూ వివాదం ఉంది. తాజాగా ఫ్యూచర్ గ్రూపుతో పాటు..అమెజాన్ కంపెనీకి అత్యున్నత ఆర్ధిక నేరాల దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.
ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన అధికారులతో పాటు అమెజాన్.కాం ఐఎన్సీ ఇండియా యాజమాన్యాన్ని భారత ప్రభుత్వ ఏజెన్సీ పిలిపించింది. గతంలో చేసుకున్న ఒప్పందం గురించి వారిని ప్రశ్నించినట్లు ది ఎకనామిక్ టైమ్స్ కథనం పేర్కొంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేరుగా రంగంలో దిగి మనీ లాండరింగ్కు సంబంధించి అమెజాన్ 2019 లో ఎఫ్పీసీఎల్ లో 49 % వాటాను కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 1,480 కోట మేర పెట్టుబడి పెట్టింది. ఇందులో భారతదేశ విదేశీమారక చట్టాలను(ఎఫ్ఈఎంఏ) ఉల్లంఘించినట్టు వచ్చిన ఆరోపణలపై ఆరా తీస్తోంది. బిగ్ బజార్, ఫుడ్ బజార్, ఈజీడే చైన్లను నడుపుతున్న ఫ్లాగ్షిప్ ఎంటిటీ ‘ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్’లో ఎఫ్సీపీఎల్ దాదాపు పది శాతాన్ని కలిగి ఉంది.
కాగా ఈడీ నోటీసులకు సంబంధించి గడువులోపు స్పందిస్తామని అమెజాన్ సంస్థ ప్రకటించింది. ఫ్యూచర్ రిటైల్ చైన్ను ముఖేష్ అంబానీ కంపెనీకి విక్రయించారు అధినేత కిషోర్ బయానీ. అయితే తమతో ఒప్పందం ఉందని, కూపన్ సంస్థలో 49 శాతం వాటా ఉంటే దీని పేరెంట్ కంపెనీ మొత్తం టోకుగా ఎలా విక్రయిస్తాయని అమెజాన్ కోర్టునాశ్రయించింది. ఈ క్రమంలో... ఏడాదిన్నరగా సదరు ఒప్పందం సంక్షోభంలో పడింది. రిటైల్ రంగంలో పోటీపడుతున్న రెండు దిగ్గజాల మధ్య ఫ్యూచర్ గ్రూపు కొట్టుమిట్టాడుతోందన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వినవస్తున్నాయి. . నష్టాల్లో ఉన్నందున త్వరగా డీల్ ఓకే చేయాలని ఫ్యూచర్ గ్రూపు భావిస్తోంది. కానీ కోర్టులో కేసులు ఇప్పట్లో ముగిసేలా లేవు. తాజాగా ఈడీ నోటీసులతో కొత్త వివాదం తెరమీదకు వచ్చింది.