లగేజ్ లేకుంటే... విమానఛార్జీలో రాయితీ...
ABN , First Publish Date - 2021-02-26T22:51:45+05:30 IST
లగేజ్ లేకపోతే విమానప్రయాణ ఛార్జీల్లో రాయితీ లభించనుంది. కేవలం క్యాబిన్ బ్యాగులతో మాత్రమే వెళ్లేవారికి ఈ రాయితీ వర్తిస్తుంది. డీజీసీఏ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నుంచి ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.

న్యూఢిల్లీ : లగేజ్ లేకపోతే విమానప్రయాణ ఛార్జీల్లో రాయితీ లభించనుంది. కేవలం క్యాబిన్ బ్యాగులతో మాత్రమే వెళ్లేవారికి ఈ రాయితీ వర్తిస్తుంది. డీజీసీఏ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నుంచి ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.
లగేజ్ లేకుండా ప్రయాణించేవారికి త్వరలో టికెట్ ధరల్లో రాయితీ కల్పించనున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. ఇకపై చెక్ ఇన్ లగేజ్ లేకుండా కేవలం క్యాబిన్ బ్యాగులతో మాత్రమే ప్రయాణించేవారికి టికెట్లపై రాయితీలు ఇవ్వనున్నారు. దేశీయ విమాన సంస్థలకు డీజీసీఏ శుక్రవారం(ఫిబ్రవరి 26) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం... విమాన ప్రయాణికులు ఏడు కిలోల వరకు క్యాబిన్ బ్యాగేజ్, 15 కిలోల వరకు చెక్ఇన్ లగేజ్లను తీసుకెళ్లవచ్చు. అంతకంటే ఎక్కువ లగేజ్ తీసుకెళితే... అదనపు ఛార్జీలు విధిస్తున్నారు. తాజా నిబంధనల ప్రకారం... ఇకపై చెక్ఇన్ బ్యాగ్లు లేకుండా కేవలం క్యాబిన్ బ్యాగులతో మాత్రమే ప్రయాణించే వారికి విమానయాన సంస్థలు టికెట్ల ధరలో రాయితీలనిస్తాయి.
ఈ రాయితీలు పొందాలంటే... ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే తమ వెంట తీసుకెళ్లే బ్యాగ్ బరువు వెల్లడించాల్సి ఉంటుంది. ‘‘ఎయిర్లైన్ బ్యాగేజీ పాలసీ మేరకు... విమానయాన సంస్థలు ప్రయాణికులకు ఉచిత బ్యాగేజ్ అలవెన్సెస్తో పాటు జీరో బ్యాగేజ్/నో చెక్ఇన్ బ్యాగేజ్ ధరల స్కీంను అందించేలా అనుమతినిస్తున్నాం. ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఈ టికెట్ ధరల స్కీం గురించి వారికి తెలియజేయాలి. ఇక ఈ వివరాలను టికెట్పై తప్పనిసరిగా ప్రింట్ చేయాలి’ అని డీజీసీఏ పేర్కొంది.