జియో చేతికి ఎయిర్టెల్ స్పెక్ట్రమ్
ABN , First Publish Date - 2021-04-07T05:41:09+05:30 IST
ఎయిర్టెల్-రిలయన్స్ జియో మధ్య తొలిసారి స్పెక్ట్రమ్ ట్రేడింగ్ ఒప్పందం కుదిరింది.
డీల్ విలువ రూ.1,497 కోట్లు
న్యూఢిల్లీ: ఎయిర్టెల్-రిలయన్స్ జియో మధ్య తొలిసారి స్పెక్ట్రమ్ ట్రేడింగ్ ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై సర్కిల్స్లో ఎయిర్టెల్కు చెందిన 800 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్లో కొంత భాగాన్ని రూ.1,497 కోట్లకు జియో కొనుగోలు చేసింది. ఇందుకోసం రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం తన చేతిలో ఉన్న 800 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్లో ముంబై సర్కిల్లో 30 మెగాహెట్జ్, ఏపీ-ఢిల్లీ సర్కిల్స్లో 20 మెగాహెట్జ్ చొప్పున ఎయుర్టెల్, రిలయన్స్ జియోకు బదిలీ చేస్తుంది.
దీంతో ఈ సర్కిల్స్లో జియో 4జీ సేవలు మరింత పటిష్ఠం అవుతాయని భావిస్తున్నారు. అయితే ఈ ట్రేడింగ్ ఒప్పందానికి ప్రభుత్వం, ట్రాయ్ వంటి రెగ్యులేటరీ సంస్థల నుంచి అనుమతులు లభించాల్సి ఉంది. టాటా టెలిసర్వీసెస్ విలీనంతో ఈ సర్కిల్స్లో ఎయిర్టెల్కు ఈ బ్యాండ్ స్పెక్ట్రమ్లో మిగులు ఏర్పడింది. అందులో కొంత భాగాన్ని జియోకు విక్రయించింది.