అవినీతిపరులకు బుద్ధి చెప్పండి
ABN , First Publish Date - 2021-04-16T10:22:34+05:30 IST
తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఓటర్లు ఉప ఎన్నికల్లో ఓటేసే ముందు బాధ్యతగా ఆలోచించాలని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విజ్ఞప్తి చేశారు.
తిరుపతి ఓటర్లకు యనమల పిలుపు
అమరావతి, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఓటర్లు ఉప ఎన్నికల్లో ఓటేసే ముందు బాధ్యతగా ఆలోచించాలని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విజ్ఞప్తి చేశారు. అరాచకాలు, అకృత్యాలు, అవినీతే లక్ష్యంగా పాలన సాగిస్తున్న వైసీపీ నేతలకు వెంకన్న సాక్షిగా ఓటుతో బుద్ధి చెప్పాలని గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి పాతరేసి, రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచిన జగన్ రెండేళ్ల పాలనలో ఏ వర్గం కూడా ప్రశాంతంగా లేదన్నారు.
పారదర్శకతలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రాన్ని నేడు అట్టడుగు స్థానానికి పడదోశారని, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారని ధ్వజమెత్తారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కుదించడం, దళితులపై దాడులు, దౌర్జన్యాలతో రక్షణ లేకుండా చేయడం, ఉచిత ఇసుక పాలసీ రద్దు చేసి దోపిడీకి మార్గం వేయడం, ఇళ్ల స్థలాల పేరుతో 6,500 కోట్ల దోపిడీ, మద్య నిషేధం మాటున రూ.25వేల కోట్ల కమీషన్లు దండుకుంటూ, నాణ్యత లేని మద్యంతో పేదల ఆరోగ్యాన్ని నాశనం చేయడం, మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేయడం, విశాఖలో భూకబ్జాలు, 22మంది ఎంపీలున్నా కేంద్రాన్ని నిలదీయకపోవడం, ప్రతి స్కీం ప్రారంభానికి ముందే స్కాం రూపొందించి దోచుకుతింటున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.