గర్భిణి సజీవదహనం కేసులో భర్తకు ఉరి
ABN , First Publish Date - 2021-04-09T08:48:46+05:30 IST
నిండు గర్భిణి అయిన భార్యపై పెట్రోలు పోసి సజీవ దహనం చేసిన కేసులో భర్తకు విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు ఉరిశిక్ష
విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు తీర్పు
విజయవాడ, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): నిండు గర్భిణి అయిన భార్యపై పెట్రోలు పోసి సజీవ దహనం చేసిన కేసులో భర్తకు విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. అతనిపైనేరం రుజువు కావడం తో న్యాయమూర్తి ప్రతిభాదేవి గురువారం సంచలన తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. గుడివాడకు చెందిన బత్తుల నంబియార్ శైలజ దంపతులు విజయవాడ ఫకీర్గూడెంలో నివాసం ఉండేవారు. శైలజ ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది. నంబియార్ అదనపుకట్నం కోసం తరచూ వేధించేవాడు.
ఆ తర్వాత భార్యకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందని కూడా అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెను అంతం చేయాలని 2019 జూన్ 15 తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో నిద్రిస్తున్న భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆ మంటల్లో శైలజ దహనమై ప్రాణాలు విడిచింది. కేసు విచారణలో నంబియారే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు నిరూపణ కావడంతో మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ప్రతిభాదేవి అతనికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించారు.