‘ఉక్కు’ పోరాటం ఆగదు
ABN , First Publish Date - 2021-10-20T08:55:29+05:30 IST
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా రాష్ట్ర ఎంపీలందరూ ఐక్యంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్ నరసింగరావు కోరారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ ఉక్కు ఉద్యోగులు, కార్మికులు

- కేంద్రంపై ఎంపీలు ఒత్తిడి తేవాలి
- పోరాట కమిటీ చైర్మన్ నరసింగరావు
- 250వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు
- 250 మంది.. 25 గంటల దీక్ష ప్రారంభం
కూర్మన్నపాలెం (విశాఖపట్నం), అక్టోబరు 19: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా రాష్ట్ర ఎంపీలందరూ ఐక్యంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్ నరసింగరావు కోరారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ ఉక్కు ఉద్యోగులు, కార్మికులు కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 250 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 250 మంది ఉద్యోగులు, కార్మికులు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి 25 గంటల దీక్షలు ప్రారంభించారు. ఈ శిబిరంలో నరసింగరావు మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునేంత వరకూ పోరాటాలు ఆపబోమన్నారు. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణకు తమ పార్టీ తరఫున పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఎంపీలందరూ స్టీల్ప్లాంటు పరిరక్షణ కోసం తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.