నిబంధనలు ఉల్లంఘించి.. భారతి సిమెంట్స్కు సాయం
ABN , First Publish Date - 2021-12-31T07:21:38+05:30 IST
నిబంధనలు ఉల్లంఘించి.. భారతి సిమెంట్స్కు సాయం
![నిబంధనలు ఉల్లంఘించి.. భారతి సిమెంట్స్కు సాయం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కాలయాపనకే కృపానందం పిటిషన్
మైనింగ్ లీజు సూత్రధారి ఆయనే
తెలంగాణ హైకోర్టుకు సీబీఐ నివేదన
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి.కృపానందం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేసినప్పుడు నిబంధనలను ఉల్లంఘించి వైఎస్ జగన్కు చెందిన భారతి సిమెంట్స్కు అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ ఆరోపించింది. శాఖాధిపతిగా చర్యలు తీసుకోవాల్సిన స్థాయిలో ఉన్నా, కృపానందమే చట్ట వ్యతిరేకంగా చేశారని సీబీఐ తరఫు న్యాయవాది సురేందర్ తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. జగన్ అక్రమాస్తులకు సంబంధించి.. భారతి సిమెంట్స్ వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కృపానందం దాఖలు చేసిన పిటిషన్పై గురువారం జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారణ జరిపింది. కృపానందాన్ని ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వ అనుమతులు అవసరం లేదని సురేందర్ తెలిపారు. సీబీఐ చార్జిసీటును సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకున్న తర్వాత పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించడం కాలయాపన చేసేందుకేనని తెలిపారు. మైనింగ్ లీజు కోసం గుజరాత్కు చెందిన అంబుజా సిమెంట్ చేసుకున్న దరఖాస్తులను కావాలని తిరస్కరించారని.. లీజు వ్యవహారంలో ఆయనే అసలు సూత్రధారి అని, వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు. తదుపరి విచారణను హైకోర్టు జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది.