గంజాయికి విజయసాయి రక్షణ: అశోక్‌బాబు

ABN , First Publish Date - 2021-10-29T09:42:03+05:30 IST

గంజాయికి విజయసాయి రక్షణ: అశోక్‌బాబు

గంజాయికి విజయసాయి రక్షణ: అశోక్‌బాబు

దళితుడిని కాబట్టే నాకు నోటీసులు: ఆనందబాబు

గొడ్డలి వేటు స్కీమ్‌కు ఎంపికైన విజయసాయి: అయ్యన్న


అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ‘‘విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు గురించి ఎవరు మాట్లాడినా విజయసాయిరెడ్డి వారిపై విరుచుకుపడిపోతున్నారు. గంజాయికి ఆయనే రక్షణ కవచంగా మారారు. గంజాయి, మాదక ద్రవ్యాల వ్యాపారంలో వైసీపీ నేతలు ఉన్నారనడానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనం’’ అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆరోపించారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. గంజాయి సాగును, స్మగ్లింగ్‌ను అరికట్టడానికి ప్రయత్నించిన పోలీస్‌ అధికారులను అభినందించాల్సిందిపోయి వారిపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని, గంజాయికి ఆయన రక్షణ ఎంత ఉందో ఇదే నిదర్శనమని అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. గంజాయి సాగులో లోకేశ్‌కు సంబంధం ఉందని ఆరోపణలు చేసిన విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చి ఆధారాలు అడిగే దమ్ము డీజీపీకి ఉందా? అని టీడీపీ నేత నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. దళిత నేతను కాబట్టే పోలీసులకు తాను లోకువగా కనిపించి, ఆఘమేఘాలపై వచ్చి నోటీసులు ఇచ్చారని అన్నారు. కాగా, ‘‘జగన్‌ రెడ్డి సోదరుడు అనిల్‌ రెడ్డి మద్యం మాఫియా కోసం తాలిబన్ల నుంచి హెరాయిన్‌ తెప్పించారని కేంద్ర దర్యాప్తు సంస్థలకు వీసా రెడ్డి ఉప్పందించిన తర్వాత వీసారెడ్డి విశాఖలో కనిపించడం లేదు. ఢిల్లీ పెద్దల బంగళాల్లో దాక్కొంటూ జగన్‌ రెడ్డి గొడ్డలి వేటుకు దొరక్కుండా కాపాడుకొంటున్నారు. వివేకా మాదిరిగానే సాయన్నకు కూడా గొడ్డలితో గుండెపోటు తెప్పించే అవకాశం ఉంది’’ అని అయ్యనపాత్రుడు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2021-10-29T09:42:03+05:30 IST