ఉపరాష్ట్రపతి వెంకయ్యపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-02-08T21:56:24+05:30 IST
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
![ఉపరాష్ట్రపతి వెంకయ్యపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు](https://media.andhrajyothy.com/appimg/galleries/202102080424037/02082021163039n93.jpg)
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి సోమవారం రాజ్యసభలో మాట్లాడుతూ.. ‘మీ మనసు బీజేపీతో, తనువు టీడీపీతో ఉన్నాయి’ అంటూ సభ చైర్మన్ వెంకయ్యనాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదన వచ్చిన వెంటనే పార్టీకి రాజీనామా చేశానని గుర్తు చేశారు. అప్పటి నుంచి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని తెలియజేశారు. తన హృదయం దేశ ప్రజలతో మమేకమై ఉందని ఉపరాష్ట్రపతి చెప్పారు. ఎవరు ఏమన్నా తాను పట్టించుకోనన్నారు. వ్యక్తిగతంగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు తనను బాధించాయని ఉపరాష్ట్రపతి ఆవేదన చెందారు.
ఏపీ సీఎం జగన్పై రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల చేసిన ఆరోపణలను రికార్డుల నుంచి తొలగించాలంటూ విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ను లేవనెత్తారు. అయితే విజయసాయి లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్ను వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. దీనికి నిరసనగా వైసీపీ ఎంపీలు వెల్లోకి వచ్చారు. ఈ సందర్భంగా వెంకయ్యపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యులు చైర్మన్ వెంకయ్యను కోరడం విశేషం.