జగమంత కుటుంబం నాది..: వెంకయ్య
ABN , First Publish Date - 2021-07-27T08:49:27+05:30 IST
‘‘జగమంత కుటుంబం నాది’’ అనేదే భారతీయుల జీవన విధానమని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో.. ప్ర
న్యూఢిల్లీ, జూలై 26: ‘‘జగమంత కుటుంబం నాది’’ అనేదే భారతీయుల జీవన విధానమని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో.. ప్రజల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి ప్రధాన శత్రువుగా మారిందన్నారు. దానిని అధిగమించడానికి ఆధ్యాత్మిక దారిని ఎంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా.. భారత ప్రాచీనతను, సంప్రదాయాలను, సంస్కృతిని నేటి యువత పుణికిపుచ్చుకోవాలని.. భావి తరాలకు అందించాలని కోరారు. ఆధ్యాత్మిక చింతన అవసరతపై ప్రజలను ఆధ్యాత్మిక గురువులు చైతన్యం చేయాలన్నారు.
కాంబోడియా, వియత్నాంలలో ప్రాచీన హిందూ దేవాలయాలపై ప్రచురితమైన రెండు తెలుగు పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా వెంకయ్య ఈ సందేశమిచ్చారు. కంచి కామకోటి పీఠాధిపతి దివంగత స్వామి జయేంద్ర సరస్వతి జయంతి సందర్భంగా స్వామీజీకి వెంకయ్య నివాళులర్పించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్, కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పాల్గొన్నారు.