లెక్కల్లోలేని 100 కోట్ల ఆస్తి

ABN , First Publish Date - 2021-12-30T08:16:33+05:30 IST

రాష్ట్రంలో విచ్చలవిడిగా దోచుకుంటున్న ధనాన్ని హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులుగా పెడుతున్నారు రాష్ట్ర రాజకీయ ప్రముఖులు.

లెక్కల్లోలేని 100 కోట్ల ఆస్తి

  • హైదరాబాద్‌లో తీగ.. కృష్ణాలో కదిలిన డొంక
  • ఓ రియల్‌ఎస్టేట్‌ సంస్థలో ఐటీ శాఖ సోదాలు
  • హైదరాబాద్‌లోని ఈ సంస్థలోకి రెండేళ్లుగా నల్లధనం
  • బ్యాంకు ఖాతాలు సీజ్‌ చేసిన అధికారులు
  • ఈ సంస్థలో కృష్ణా రాజకీయ ప్రముఖుడి పెట్టుబడులు
  • సంస్థ కూడా ఆయన బినామీలదేనని ప్రచారం


విజయవాడ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విచ్చలవిడిగా దోచుకుంటున్న ధనాన్ని హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులుగా పెడుతున్నారు రాష్ట్ర రాజకీయ ప్రముఖులు. హైదరాబాద్‌లోని ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థపై బుధవారం ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ విషయం బయటపడింది. గత రెండేళ్లుగా సదరు సంస్థలోకి పెద్ద ఎత్తున నల్లధనం పెట్టుబడుల రూపంలో తరలిందన్న పక్కా సమాచారంతో ఐ టీ అధికారులు దాడులు చేశారు. లెక్క చూపని రూ. 100 కోట్ల లావాదేవీలను అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ఐటీ అధికారులు సీజ్‌ చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ రాజకీయ ప్రముఖుడు ఈ సంస్థలోసుమారు రూ.100 కోట్ల పైచిలుకు పెట్టుబడులుగా పెట్టినట్టు తెలుస్తోంది. నెలరోజుల క్రితం ఓ వ్యాపారవర్గానికి ఆర్థిక లబ్ధి చేకూర్చిన వ్యవహారంలో ఈయనకు ఎనిమిది శాతం కమీషన్‌ ముట్టినట్టు సమాచారం. ఈ మొత్తమే సుమారు రూ.60 కోట్లు వరకు ఉంటుందని, ఆ మొత్తాన్ని కూడా నెల క్రితమే సదరు రియల్‌ సంస్థలోకి తరలించినట్టు చెబుతున్నారు. ఏడాది క్రితం ఈ సంస్థకు చెందిన వ్యక్తులు షామీర్‌పేట్‌లో 110 ఎకరాలు కొన్నట్టు సమాచారం. ఈ మొత్తం లావాదేవీలపై దృష్టి సారించిన ఐటీ అధికారులు....దాడులకు సంబంధించిన వివరాలను మాత్రం ధ్రువీకరించడం లేదు.

Updated Date - 2021-12-30T08:16:33+05:30 IST